పట్టణాలకే పరిమితం కాదు..
పేదల భోజనం గ్రామాల దాకా!
సంక్రాంతికి 70 అన్న క్యాంటీన్లతో చంద్రబాబు ‘వెల్ఫేర్ రీ-లాంచ్’
ఎం.గణేశ్, జర్నలిస్టు.
పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన అన్న క్యాంటీన్ల పథకం ఇప్పుడు మరో కీలక దశకు చేరుకుంది. పట్టణాల్లో విజయవంతంగా కొనసాగుతున్న ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగను లక్ష్యంగా పెట్టుకుని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఒకేసారి 70 కొత్త అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. జనవరి 10లోగా నిర్మాణ పనులు పూర్తిచేసి, జనవరి 13 నుంచి 15 మధ్యలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. అన్న క్యాంటీన్ల పథకం తొలిసారిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో పట్టణ ప్రాంతాల్లో ప్రారంభమైంది. పేదలు, కూలీలు, వలస కార్మికులు, ఆసుపత్రుల వద్ద ఉండే బాధితులకు భోజనం కోసం ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రారంభ దశలో రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి విస్తృత ఆదరణ లభించడంతో క్రమంగా ఈ పథకం అన్ని పట్టణాలకు విస్తరించింది. మొదటి దశలో అన్న క్యాంటీన్లు ఎక్కువగా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, ఒంగోలు, అనంతపురం, చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం వంటి పట్టణాల్లో ప్రారంభమయ్యాయి. అప్పట్లో జిల్లాల వారీగా చూస్తే విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించగా, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. తరువాత దశల్లో అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ పట్టణ కేంద్రాల పరిధిలో అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి.

ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో మొత్తం 205 అన్న క్యాంటీన్లు కొనసాగుతున్నాయి. ఈ క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కేవలం ఐదు రూపాయలకే అందిస్తున్నారు. రోజుకు మూడు పూటలా కలిపి రెండు లక్షల మందికి పైగా ప్రజలు ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు 7.20 కోట్ల మందికి పైగా ప్రజలు అన్న క్యాంటీన్లలో భోజనం చేయగా, మధ్యాహ్న భోజనం చేసినవారు 3.16 కోట్లు, ఉదయపు అల్పాహారం తీసుకున్నవారు 2.62 కోట్లు, రాత్రి భోజనం చేసినవారు 1.42 కోట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అన్న క్యాంటీన్లకు అత్యధిక స్పందన విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కనిపిస్తోంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ ఆసుపత్రుల పరిసరాల్లో ఉన్న క్యాంటీన్లకు రోజూ భారీ సంఖ్యలో పేదలు వస్తున్నారు. పట్టణాల్లో ఈ పథకం సాధించిన విజయమే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరణకు ప్రేరణగా మారింది.గ్రామాల్లో కూడా అన్న క్యాంటీన్లు అవసరమని ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కొత్తగా 70 అన్న క్యాంటీన్లకు మంజూరు ఇచ్చింది. ఈ క్యాంటీన్లు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నారు. దీంతో గ్రామీణ కూలీలు, రైతులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు తక్కువ ధరకే భోజనం అందుబాటులోకి రానుంది.

గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న 70 అన్న క్యాంటీన్లు జిల్లా వారీగా చిత్తూరు జిల్లాలో 7, గుంటూరు జిల్లాలో 5, శ్రీకాకుళం జిల్లాలో 5, తూర్పుగోదావరి, ఏలూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో తలా 4 చొప్పున ఏర్పాటు చేయనున్నారు. అలాగే విజయనగరం, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో తలా 3 క్యాంటీన్లు ఏర్పాటు కానున్నాయి. కాకినాడ, తిరుపతి జిల్లాల్లో రెండు చొప్పున, పార్వతీపురం మన్యం, పల్నాడు, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి, నంద్యాల, కడప జిల్లాల్లో ఒక్కో క్యాంటీన్ చొప్పున ప్రారంభించనున్నారు. గ్రామాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభమైతే భోజనం కోసం పట్టణాలకు వెళ్లే అవసరం తగ్గనుంది. తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించడం ద్వారా గ్రామీణ పేదల జీవన వ్యయాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. పట్టణాల్లో విజయవంతమైన అన్న క్యాంటీన్ల పథకం గ్రామాల్లోనూ అదే స్థాయిలో ప్రజల ఆదరణ పొందుతుందన్న నమ్మకంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. సంక్రాంతి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వస్తే, ఇది పేదల జీవితాల్లో మరో కీలక మార్పుగా నిలవనుంది.
—-
