రెండో దశలో 44,676 ఎకరాలలు
కొత్తగా 11 గ్రామాల్లోని రైతుల నుంచి భూములు తీసుకునే దిశగా ప్రభుత్వ నిర్ణయం
రైతులు అంగీకరిస్తే భూ సమీకరణ లేకుంటే భూ సేకరణ
వారం రోజుల్లోపు నోటిఫికేషన్..
ఎం.గణేశ్, జర్నలిస్టు.
అమరావతిలో రోజుకో విధంగా సమీకరణలు మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తమ ఆర్ధిక పరిస్ధితులు అనూహ్యంగా మారిపోతాయని రాజధాని గ్రామాల ప్రజలు భావించారు. అదే విధంగా భూముల ధరలు పెరిగాయి. ఎకరా భూమి ధర కోట్లలోనే పలుకుతుంది. కొనుగోలు, అమ్మకాలు కూడా పెరిగాయి. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్ధలకు ప్రభుత్వం రైతుల నుంచి సమీకరించిన భూములను పంపిణీ చేస్తుండటంతో నిర్మాణాలు పెరిగే పరిస్ధితులు నెలకొన్నాయి. పరిస్ధితులను గమనించిన రాజధాని గ్రామాల రైతులు భూముల ధరలను అనూహ్యంగా పెంచేశారు. కోర్ కేపిటల్ ప్రాంతాల్లోని భూముల ధరలు సామాన్యులు ఊహించని రీతిలో చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే రాజధాని అమరావతి విస్తరణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పుడున్న 54 వేల ఎకరాలకు తోడు అదనంగా 44,676 ఎకరాలు సమీకరించనున్నది.
దీని కోసం మూడు మండలాల పరిధిలో 11 గ్రామాలను గుర్తించారు. కొత్తగా సేకరించే గ్రామాలతో కలిపి రాజధాని ప్రాంతం మొత్తం లక్ష ఎకరాలకు చేరుకుంటుంది. వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లు సమీకరణకు నోటిఫికేషన్ ఇవ్వగానే సిఆర్డిఎ సమీకరణ ప్రక్రియ చేపట్టనుంది. తొలి విడత రైతుల నుంచి భూములను సమీకరించిన విధంగా రెండో విడత కూడా సమీకరణ విధానాన్ని అమలు పరచనున్నది. అయితే రాజధాని రెండో విడత విస్తరణ కార్యక్రమానికి కొన్ని గ్రామాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. తొలివిడత రైతుల నుంచి సేకరించిన భూముల రైతులకు ఇంకా పూర్తి స్ధాయి న్యాయం జరగలేదని, ఆ రైతులకు కేటాయించిన భూములను ఇప్పటి వరకు గ్రౌండ్ లెవిల్ ల్లో స్వాధీనం చేయలేదని, రేటు ఎక్కువ పలుకుతున్న ప్రస్తుత తరుణంలోనే వాటిని అమ్ముకోడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. భూములు, స్ధలాలను కొనుగోలు చేసే వ్యక్తులు తమ భూములను ఏ గ్రామాల్లో వస్తాయో గ్రౌండ్ మీద చూపించాలని అడుతున్నారు. అయితే ప్రభుత్వం ఇంత వరకు లే అవుట్లు వేసి రైతులకు ఆ స్ధలాలను కేటాయించకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. దీనితో తొలి విడత రైతుల్లోనే కొంత వ్యతిరేకత కనపడుతుంది.
పూర్తిగా సుముఖంగా లేని రైతులు
రెండో విడత విస్తరణ చేయాలనుకున్న గ్రామాల్లోని రైతులు కూడా పూర్తిగా సుముఖంగా లేరు. కొందరు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో మంత్రి నారాయణ ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని స్పష్టం చేస్తున్నారు. రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం జరగాలన్నా, ఇతర అంతర్జాతీయ పరిశ్రమలు రావాలన్నా విస్తరణ తప్పదని చెబుతున్నారు. సహకరించిన రైతులకు మంచి భవిష్యత్ ఉంటుందని, వచ్చేరోజుల్లో భూముల ధరలు అధికంగా పెరగడమే కాకుండా దేశం గుర్తించే రాజధానిలో స్ధిరనివాసం ఏర్పరుచుకోవచ్చని నచ్చచెబుతున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకరించకపోతే భూసేకరణ చేపట్టేందుకు కూడా ప్రభుత్వం వెనుకంజ వేయదని చెబుతున్నారు. అలా జరిగితే రైతులు నష్టపోతారని చెబుతున్నారు. భూ సమీకరణ కంటే భూ సేకరణకు నష్టపరిహారం తక్కువగా వస్తుందని, అదే జరిగితే రైతులు నష్టపోతారని చెబుతున్నారు. రైతులు స్వచ్చంధంగా భూములు ఇవ్వకపోతే నిర్బంధంగా భూ సేకరణ చేయక తప్పదని చెప్పకనే చెబుతున్నారు. అయితే ప్రధాని మోది రాక రాజధాని గ్రామాల ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తున్నది.
ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు :
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. రైతులు ప్రధానికి అరుదైన స్వాగతం పలికేందుకు సిద్దం అవు తున్నారు. ప్రధాని సభలో అమరావతి రైతులకు ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తున్నారు. బహిరంగ సభలోనూ ప్రధాని ప్రసంగించనున్నారు. కాగా, ప్రధాని పర్యటన వేళ రాజధాని లో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త లెక్కలతో ముందుకు వెళ్తున్నారు. ఆయన అన్నదే తడవుగా పూలింగు పరిధిలోకి వచ్చే గ్రామాల్లో కూటమి పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు సమావేశాలు ఏర్పాటు చేశారు. అభ్యంతరాలున్నా రైతులందరూ అంగీకరించినట్లు ప్రకటించారు. కొత్తగా పూలింగు చేపట్టబోయే గ్రామాల్లో తుళ్లూరు మండల పరిధిలోని హరిశ్చంద్రాపురం, వడ్డమాను రెవెన్యూ గ్రామాలను పూర్తిగా చేర్చారు.
గ్రామాల వారీగా సమీకరించనున్న భూముల వివరాలు
11 గ్రామాల పరిధిలో హరిశ్చంద్రాపురంలో 2,429 ఎకరాలు, వడ్డమానులో 1,937 ఎకరాలను సమీకరించనున్నారు. పెద రిమిలో 6,513 ఎకరాలు తీసుకోనున్నారు. అమరావతి మండల పరిధిలోని వైకుంఠపురంలో 3,360 ఎకరాలు, ఎండ్రాయిలో 2,167, కర్లపూడిలో 2,947, మోతడకలో 2,345, నిడుముక్కలలో 2,013 ఎకరాలు సమీకరణ కింద తీసుకోనున్నారు.
