ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. రాష్ట్ర ప్రగతికి భుజం కాస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అమరావతికి ఉందని ఉద్ఘాటించారు. ‘‘ఇంద్రలోక రాజధాని పేరు అమరావతి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. స్వర్ణాంధ్ర నిర్మాణానికి ఇది శుభసూచిక. స్వర్ణాంధ్ర విజన్కు అమరావతి శక్తినిస్తే.. వికసిత్ భారత్కు స్వర్ణాంధ్ర బలమవుతుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులతోపాటు వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆయన వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా పలుమార్లు తెలుగులోనే మాట్లాడారు. ‘అమరావతి దేశానికే మార్గదర్శకంగా మారబోతోంది. ఆంధ్రప్రదేశ్లోని యువత కలలు నిజం చేసే నగరంగా నిలవబోతోంది. ఐటీ, కృత్రిమ మేధ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీ, విద్య, ఆరోగ్య రంగాల్లో దేశానికే మార్గదర్శకంగా (లీడింగ్ సిటీ)గా అమరావతి రూపొందుతుంది. ఈ రంగాల్లో మౌలిక వసతుల కల్పనను రికార్డుస్థాయిలో పూర్తి చేసేందుకు అవసరమైన మద్దతును రాష్ట్రానికి కేంద్రం అందిస్తుంది’ అని చెప్పారు. ‘కలలు కనడమే కాకుండా, వాటిని నిజం చేసుకోవడంలో ఆంధ్ర ప్రజలు ముందుంటారు’ అని ప్రశంసించారు.

‘‘రూ.60వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. ఇవి కాంక్రీట్ నిర్మాణాలు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలు.. వికసిత్ భారత్ ఆశయాలకు బలమైన పునాదిగా మారబోతున్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. ‘అమరావతి అంటే ఒక సంప్రదాయం, పురోగతితో కలిసి నడిచే భూమి.. బౌద్ధ వారసత్వపు శాంతితోపాటు.. వికసిత భారత్ను నిర్మించుకోగల శక్తి అమరావతికి ఉంది. కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్కు నాంది’ అని చెప్పారు.
‘‘2015 సంవత్సరంలో ప్రజా రాజధానికి శంకుస్థాపన చేసే అవకాశం నాకు లభించింది. గత కొన్నేళ్లుగా కేంద్రం అమరావతికి అన్ని విధాలుగా సహాయం అందిస్తోంది. మౌలిక సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలో.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రహాలు అనుకూలించాయి. అమరావతిలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, రాజ్భవన్ సహా వివిధ భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తున్నాం’ అని మోదీ వివరించారు.
