
ఎం.గణేశ్, జర్నలిస్టు
విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ జానకి రామయ్య (93) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం గన్నవరం శివారులోని రుషి వాటిక వృద్ధుల నిలయంలో తుదిశ్వాస విడిచారు. 27 సంవత్సరాలపాటు విజయ డెయిరీ చైర్మన్ గా పని చేశారు. “ఆపరేషన్ ఫ్లడ్” ద్వారా డాక్టర్ వర్గీస్ కురియన్ భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగాని తయారు చేశారు. అరుదైన దార్శనికత కలిగిన డాక్టర్ కురియన్ తన జీవిత కాలాన్ని భారతదేశ రైతులను శక్తిమంతం చేయడం కోసం అంకితం చేశారు. అందుకే ఆయనను “శ్వేత విప్లవ పితామహుడు” గా పిలుస్తారు.
అదే రీతిలో మండవ జానకీ రామయ్య విజయ డెయిరీ పరిధిలోని రైతులను ఆర్ధికంగా శక్తిమంతులను చేశారు. రాజకీయాలకు అతీతంగా డెయిరీలోని పాలనా వ్యవహారాలను కొనసాగించారు. పాల ఉత్పత్తిదారులకు మెరుగైన సేవలు అందించేందుకు జానకిరామయ్య చాలా కృషి చేశారు. విజయ డెయిరీని విస్తరించడంలో జానకిరామయ్య చేసిన కృషి అసామాన్యం. పాడి పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా డాక్టర్ కురియన్ అవార్డు లభించింది.

మండవ ప్రస్తానం
మండవ జానకి రామయ్య ప్రస్థానం ఇంతింతై ఓటుడింతై అన్న చందంగా సాగింది. 1981 పూర్వం తెలంగాణలో, విశాఖ స్టీల్ ప్లాంట్ లో క్లాస్ 1 కాంట్రాక్టర్. 1981లో మొవ్వ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవానికి రాజీ చేయించాలని గ్రామస్తులు ఆయన్ని పిలిపించారు. అయితే రాజీ కుదరక పోవటంతో ఆయన్నే రంగంలోకి దించగా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. అప్పటి నుండి మొవ్వ గ్రామ అభివృద్ది మొదలైంది. గ్రామంలో సుమారు 21 ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయించారు. కేవలం 5000 జనాభా ఉన్న గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, వేమూరి సుందర రామయ్య ఆర్ధిక తోడ్పాటుతో డిగ్రీ కళాశాల, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ స్థాపించటంలో విశేష కృషి చేశారు. గ్రామ పంచాయతీ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రవాస భారతీయుడు మండవ కనకయ్య కుమారుడు బాబూరావు ఆర్ధిక తోడ్పాటు అందించగా జానకి రామయ్య రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేశారు. తద్వారా పంచాయతీకి సంవత్సరానికి సుమారు 20 లక్షల రూపాయిల ఆదాయం లభిస్తోంది. అంతే కాకుండా కృష్ణా జిల్లా పాల ఉత్పత్తి దారుల పరస్పర సహకార సంఘం అధ్యక్షుడిగా 27 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఎన్నికై తీవ్ర నష్టాల్లో ఉన్న సంస్థని లాభాలు బాట పట్టించారు. 5 సంవత్సరాలపాటు ఉమ్మడి రాష్ట్ర డెయిరీ ఫెడరేషన్ చైర్మన్ గా పని చేసి అత్యుత్తమ సేవలు అందించారు. ప్రతీ ముఖ్యమంత్రి వద్ద అనేక ప్రశంసలు అందుకున్నారు. తన 94 వ ఏట అనారోగ్య కారణంగా గురువారం ఉదయం 7గం.లకి తుది శ్వాస విడిచారు. అంత్యక్రియలు గురువారం సాయంత్రం జరిగాయి. వారి భార్య 6 సంవత్సరాల క్రితం పరమపదించారు. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కుమారుడు ఆయన వద్దనే ఉంటున్నారు.
————————–