గోవాలో తీవ్ర విషాదం జరిగింది. శిర్గావ్లో గల లైరాయ్ ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. జాతరను పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తొక్కిసలాట (Stampede in Temple) జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. మరో 50 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (Goa Stampede)
శ్రీ లైరాయ్ ఆలయంలో శుక్రవారం నుంచి వార్షిక జాతర ప్రారంభమైంది. దీంతో లైరాయ్ అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా (Goa) నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆ ఆలయంలో అనాదిగా వస్తున్న ‘నిప్పులపై నడిచే’ ఆచారంలో శనివారం తెల్లవారుజామున వేలాది మంది పాల్గొన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా రద్దీ ఎక్కువై పరిస్థితి అదుపు తప్పింది.
భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు తెచ్చేందుకు ప్రయత్నించారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. జాతర దృష్ట్యా వచ్చే రద్దీని నియంత్రించేందుకు ఆలయ నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రమాదంపై మోదీ ఆరా..
తొక్కిసలాటలో గాయపడిన వారిని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Goa CM Pramod Sawant) పరామర్శించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తనకు ఫోన్ చేసిన ప్రమాదంపై ఆరా తీసినట్లు తెలిపారు. అన్ని విధాలా అండగా ఉంటామని కేంద్రం భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నారు.
