వారి త్యాగాలను గుర్తించాలంటున్నకేడర్
పదవుల కేటాయింపులో ప్రతీసారీ నిరుత్సాహమే
ఉమా, వర్మ, శ్రీధర్ల పరిస్ధితిపై అంతర్గతంగా చర్చ
ఎం.గణేశ్, సీనియర్ జర్నలిస్టు
వీరు పార్టీకి వీర విధేయులు. పసుపు చొక్కాతోనే రాజకీయ జీవితం ప్రారంభించారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వెన్ను చూపలేదు. కార్యకర్తలు జెండా పట్టుకోవడానికి బయపడిన రోజుల్లో వారికి ముందు నిలిచారు. పార్టీతోనే తమ జీవనం అనే రీతిలో వ్యవహరించారు. అధికారం వచ్చిన తరువాత కూడా శృతి మించి వ్యవహరించలేదు. నిబద్దత కలిగిన ఈ నేతలు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో తెరమరుగయ్యారు. జనసేన, బీజేపి పొత్తుల కారణంగా, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుని సీట్లు కేటాయింపు వలన మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్నికోల్పోయారు. సీటు రాకపోయినా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. తమ నియోజకవర్గంలో మరో వ్యక్తి శాసన సభ్యునిగా గెలిస్తే, రాజకీయంగా వెనుక పడిపోతామనే విషయాన్ని కూడా పక్కన పెట్టి అభ్యర్ధుల గెలుపునకు పని చేశారు. కూటమి అభ్యర్ధులు అక్కడ గెలిచిన తరువాత నియోజకవర్గాల్లో అవమానాలు ఎదురౌతున్నా, ప్రాధాన్యత లేకపోయినా, తమ అనుయాయులకు పనులు కాపోయినా అధినేత నారా చంద్రబాబు పిలుపు కోసం సంయమనంతో ఎదురు చూస్తున్నారు. ఏడాదిన్నర సమయం దాటి పోయింది. ఇంకా తమ నేత సేవలకు గుర్తింపు రావడం లేదనే బాధ వారి అనుయాయుల్లో కలుగుతోంది. అసహనంతో, ఆగ్రహంతో కార్యకర్తలు, అనుయాయులు ఉన్నప్పటికీ వారిని సముదాయిస్తూనే ఉన్నారు. వారిలో ఒకరు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, మరొకరు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాన్ కు పోటీ చేసే అవకాశం కల్పించిన ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ, భాష్యం ప్రవీణ్ కోసం సీటును త్యాగం చేసిన కొమ్మాలపాటి శ్రీధర్ . వివరాలు ఇవి.


గత ఎన్నికల్లో టికెట్టు త్యాగం చేసిన ఈ ముగ్గురు నేతలకు నియోజకవర్గాల్లో బలమైన కేడర్ ఉంది. పార్టీలోనూ మంచి పేరుంది. వివాద రహితులుగా గుర్తింపు ఉంది. ప్రభుత్వం ఏర్పాటు అయిన తరవాత వీరి త్యాగానికి తగిన రీతిలో గుర్తింపు ఉంటుందని పార్టీ నుంచి హామీ కూడా ఉంది. అయితే ఈ నెలల కాలంలో పదవుల కేటాయింపు సమయంలో అనేక సార్లు వీరి పేర్లు తెరమీదకు వచ్చాయి.ఇదిగో మా నేతకు ఎమ్మెల్సీ వచ్చేసింది…ఇదిగిదిగా పలానా నామినేటెడ్ పోస్టు వచ్చేసిందని ఆ నేతల అభిమానులు, అనుయాయులు సంబంర పడేవారు. తీరా ఈ నేతలకు కాకుండా వేరే వారికి పదవులు లభించడంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ ఎదురైంది.

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు కంచుకోట. మేజరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఇరిగేషన్ కు సంబంధించిన వచ్చిన ప్రతీ విమర్శకు ధీటుగా సమాధానం చెప్పేవారు. సాగునీటి వనరులు, ప్రాజెక్టుల మీద పూర్తిగా అవగాహన పెంచుకుని వాటిపై అనర్గణంగా ప్రసంగించేవారు. మంత్రిగా సమర్ధంగానే పని చేశారనే పేరు లేకపోలేదు. దీనికితోడు నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలోనూ పేరు పెట్టి పిలిచే స్ధాయిలో ఆయనకు కార్యకర్తలతో సంబంధాలు ఉన్నాయి. ఎన్నికల కోసం పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్న సమయంలో ఆ నియోజకవర్గం సీటును వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాదు కు పార్టీ కేటాయించింది. పార్టీ అదేశాలకు అనుగుణంగా దేవినేని ఉమా వ్యవహరించారు. ఎన్నికల తరువాత పదవుల కేటాయింపు సమయంలో ప్రతీసారీ ఉమా పేరు తెరపైకి వచ్చేది. అయితే ఇప్పటి వరకు ఎటువంటి పదవి లభించలేదు. అయినా పార్టీ పిలుపు కోసం ఆయన ఎదురు చూస్తునే ఉన్నారు. ఇక గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన కొమ్మలపాటి శ్రీధర్ పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. 2009, 2014 ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గం నుంచి టిడిపి తరఫున వరుస విజయాలు దక్కించుకున్నారు. కొన్ని ప్రత్యేక రాజకీయ కారణాల దృష్ట్యా గత ఎన్నికల్లో భాష్యం ప్రవీణ్ కోసం టికెట్ త్యాగం చేశారు. అయితే పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు అయిపోయినా ఇప్పటివరకు కొమ్మాలపాటి శ్రీధర్ విషయం డైలమాలో ఉంది. ప్రస్తుతం కొమ్మాలపాటి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. ఇక పిఠాపురం నియోజవర్గానికి చెందిన ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందిన రికార్డు ఉంది. ఇప్పటి రాజకీయ పరిస్ధితిల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందడం అంతా ఆషామాషీ కాదు. అటు వంటి నేతకు సీటు ఇవ్వకుండా జనసేనాని పవన్ కళ్యాన్ కు ఇచ్చారు. పొత్తులో భాగంగా ఈ సీటు కేటాయింపు జరిగింది. ఆ నియోజకవర్గం నుంచి పవన్ గెలిచే అవకాశాలు అధికంగా ఉండటంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు పవన్ కు సీటు కేటాయించారు. గెలుపు కోసం వర్మ తీవ్రంగా పని చేశారు. అయితే గెలిచిన తరువాత గుర్తింపు రాకపోగా,అనేక సందర్భాల్లో అవమానాలకు గురయ్యారు. ఇప్పటి వరకు ఏ పదవి రాకపోవడంతో అయన అనుచరులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇలాంటి నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నప్పటికీ వివాద రహితులుగా ఉన్న వీరిని పార్టీ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సీనియర్ల అభిప్రాయం. ఎన్ని వత్తిడిలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని పార్టీ కోసం పని చేసిన రికార్డు వీరికి ఉంది.

ప్రభుత్వం అమరావతి నిర్మాణంతోపాటు అనేక ఐటీ కంపెనీలు, ఇతర సంస్ధలను ఏపీకి తీసుకువస్తుంది. పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. పార్టీ, ప్రభుత్వానికి ప్రజల పట్ల సానుకూల వాతావరణం కనపడుతోంది. ఇటువంటి సమయంలో ఈ తరహా నేతలకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది ఆ పార్టీ నేతలకు ప్రయోజనం చేకూరడం కంటే పార్టీకే మంచి పేరును తెచ్చిపెడుతుందనటంలో అతిశయోక్తి లేదు.
