మహిళా లోకంలో ఉత్సాహం వెల్లివిరిసింది. కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఉచిత ప్రయాణం పథకానికి విశేష స్పందన లభించింది. శనివారం మహిళలు పెద్దసంఖ్యలో ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. ‘స్త్రీశక్తి’ పేరుతో ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ప్రారంభించగా… తొలిరోజు 76వేల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. శనివారం ఆ సంఖ్య భారీగా పెరిగింది. రాత్రి 9 గంటల వరకు 11.47 లక్షల మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. రెండు రోజులు కలిపి… మహిళలకు ఈ పథకం వల్ల రూ.5 కోట్లకుపైగా లబ్ధి చేకూరిందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) సగటున 69% ఉంటుంది. సెలవు రోజుల్లో 60% నమోదవుతుంది. కానీ ఉచిత బస్సు ప్రభావంతో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి సెలవైనా 75% వరకు ఓఆర్ వచ్చింది. సోమవారం నుంచి 90%పైగా ఓఆర్ రావచ్చని ఆర్టీసీ వర్గాల అంచనా.
ఎటు చూసినా కోలాహలం
రాష్ట్రంలో శనివారం నగరాలు, పట్టణాలు, పల్లెలన్న తేడా లేకుండా మహిళా ప్రయాణికుల సందడి కనిపించింది. పిల్లలకు వరుసగా మూడురోజులు సెలవులు రావడంతో… పుట్టిళ్లకు వెళ్లేవారు, బంధువుల ఇళ్లకు వద్దామనుకునేవారు, ఆలయాలు, విహార కేంద్రాలకు వెళ్లేవారితో ఎటు చూసినా కోలాహలం కనిపించింది. చిరు వ్యాపారులు గతంలో షేర్ ఆటోలు, ఇతర రవాణా సాధనాలపై ఎక్కువగా ఆధారపడేవారు. బస్సుప్రయాణం ఉచితం కావడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. పట్టణాలు, నగరాల్లోని ఆస్పత్రులకు వెళ్లే మహిళలకు… గతంలో టికెట్ ఛార్జీలు అదనపు భారంగా ఉండేవి. ఇప్పుడు అదీ తగ్గింది.
