భూ దందాలు చేసినా, తప్పుడు దస్తావేజులు సృష్టించినా, కబ్జాలకు పాల్పడ్డా సహించేది లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఈ విషయాన్ని భూ నేరాలకు పాల్పడేవారికి కఠినంగా తెలియజేయబోతున్నామని తెలిపారు. కష్టపడి సంపాదించుకున్న చిన్నపాటి జాగాలు, వారసత్వంగా వచ్చిన భూముల్ని కాపాడుకోవడం కోసం సామాన్యులు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని, ప్రజల ఆస్తులకు కూటమి పాలనలో భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భూకబ్జాలు, ఆక్రమణలపై తన కార్యాలయానికి వచ్చిన ఆర్జీలపై శుక్రవారం ఆయన అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘కూటమి ప్రభుత్వం ప్రజలకు, వారి ఆస్తులకు రక్షణ ఇస్తుంది. గత పాలకులు ప్రజల ఆస్తులను వివాదాల్లోకి నెట్టి.. కబ్జాలు చేసేలా చట్టాలే చేశారు. వారి మద్దతుతో కొందరు దందాలు సాగించారు. ఆ తరహా అక్రమాలు చేసేవారిపై కూటమి ప్రభుత్వం కఠినంగా ఉంటుంది. ప్రజల నుంచి ఇప్పటికీ అలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి’ అని తెలిపారు. ‘నేనే స్వయంగా జిల్లా కేంద్రాలకు వెళ్లి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల సమక్షంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తా. వారి బాధలు తెలుసుకొని, భరోసా ఇస్తా. తొలుత కాకినాడ, విశాఖపట్నం వెళ్తా. ఆయా ప్రాంతాల్లో బాధితులతో మాట్లాడతా. వారి ఫిర్యాదులను పరిశీలిస్తా. బాధితులు కూటమి నేతల మూలంగా ఇబ్బందిపడ్డా.. ఉపేక్షించబోం. కారకులపై చర్యలు తీసుకొంటాం’ అని హెచ్చరించారు. ‘కూటమి ప్రభుత్వ పాలన పారదర్శకంగా, నిష్పాక్షికంగా సాగుతుంది. ఇందుకోసం సంబంధిత శాఖల అధికారులతో చర్చిస్తా. నా కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రక్రియ చేపట్టాలి’ అని సూచించారు.
