అతని చేసిన మద్యం స్కాం వివరాలేమిటి?
జగన్ తో అతనికున్న బంధుత్వం పై ఆరా1
ప్రభుత్వానికి ఎలా నష్టం కలిగించారు.
ఇవీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
ఏపీ స్టేట్ బ్యూరో:
చాలా మంది రాజకీయ వేత్తలు ఢిల్లీ మద్యం స్కాం కంటే ఏపీ మద్యం స్కాం పెద్దదని ఎప్పటి నుంచో చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టేంత వరకు, సిట్ విచారణ చేపట్టేంత వరకు వాటిని పట్టించుకోలేదు. ఇవి కేవలం రాజకీయ పరమైన విమర్శలే అని భావించారు. అయితే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చుట్టూ కుంభకోణం తిరుగుతుండటంతో దీనిలో ఏదో ఉందని భావించారు. ఇటీవల విజయసాయి రెడ్డి, కసిరెడ్డిలు ఒకరిపై మరొకరులు ఆరోపణలు చేసుకున్న తరువాత ఈ స్కాం దేశ రాజధాని కంటే పెద్దదే అయి ఉండవచ్చని నమ్ముతున్నారు. అసలు కసిరెడ్డి ఎవరు? అతను చేసిన నేరం ఏమిటీ? మధ్యం కుంభకోణం ఎలా జరిగిందీ అనే విషయాలను ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. కొందరి సందేహాలకు సమాధానాలివి.
కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వివాదాస్పద వ్యక్తిగా మిగిలిపోయారు. ఐటీ సలహాదారుగా, సినీ నిర్మాతగా, వైఎస్సార్సీపీ నాయకుడిగా ఆయన ప్రస్థానం ఎన్నో మలుపులతో నిండి ఉంది. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ కావడం ఆయన జీవితంలో కీలక మలుపుగా నిలిచింది. సాధారణంగా రాజ్ కసిరెడ్డిగా పిలవబడే ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. ఈయన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేయడం, మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కోవడం, సినిమా నిర్మాణంలో పాల్గొనడం వంటి వివిధ కారణాలతో వార్తల్లో నిలిచారు.
కడప జిల్లా :
రాజ్ కసిరెడ్డి కడప జిల్లాకు చెందిన వారు. తల్లిదండ్రులతో పాటు రాజ్ కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అక్కడే వ్యాపార, రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఇతను సాఫ్ట్ వేర్ డెవలపర్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రాజశేఖర్ రెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి రెండు రోజుల క్రితం సిట్ విచారణకు హాజరయ్యారు..
జగన్ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ పాలసీలో పెద్ద కుంభకోణం జరిగిందని, వేల కోట్ల రూపాయలను వైసీపీ నేతలు దోచుకున్నారని టీడీపీ ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే లిక్కర్ స్కాంపై విచారణ జరిపిస్తామని అప్పట్లో ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ లావాదేవీల్లో చోటుచేసుకున్న అక్రమాలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఇందులో వైసీపీ అగ్రనేతల పాత్ర ఉన్నట్టు గుర్తించింది. ఎంపీ మిథున్ రెడ్డి అప్పటి ఏపీబీసీఎల్ ఎండీ వాసుదేవ రెడ్డి కీలకపాత్ర పోషించినట్లు భావిస్తోంది. వీళ్లకు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసింది.
అయితే ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరును విజయసాయి రెడ్డి బయటపెట్టడంతో అందరి చూపూ అటువైపు మళ్లింది. కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అందరూ రాజ్ కసిరెడ్డి అని పిలుస్తూ ఉంటారు. ఆయన్ను జగన్ ఐటీ సలహాదారుగా నియమించుకున్నారు. విదేశాల్లో ఆయనకు పలు వ్యాపారాలు ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా లిక్కర్ కంపెనీలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ అనుభవంతో జగన్ కు బాగా దగ్గరయ్యాయని, లిక్కర్ స్కాంలో కీలకపాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నీ తానై వ్యవహరించారని చెప్పారు.
వైఎస్సార్సీపీలో ఎప్పుడు చేరారు?
రాజ్ కసిరెడ్డి 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో చేరారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్ కసిరెడ్డి ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమితులయ్యారు. అంతకుముందు. ఈయన వైఎస్సార్సీపీ ఎన్ఆరి విభాగం కన్వీనర్ పనిచేశారు. 2019 ఎన్నికల ముందు ఈయన పార్టీలో చురుకైన పాత్ర పోషించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో బంధుత్వం?
రాజ్ కసిరెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దూరపు బంధువుగా చెబుతున్నారు. అయితే అందుకు సంబంధించిన ఆధారాలు లేవు. వార్తా సంస్థలు ఈయనను జగన్ సన్నిహిత సంబంధం కలిగిన వ్యక్తిగా వర్ణించాయి. ఈ సంబంధం రాజకీయ, వ్యాపార సహకారంతో ముడిపడి ఉండవచ్చు.
మద్యం కుంభకోణంలో అరెస్ట్
ప్రభుత్వానికి ఎలా నష్టం కలిగింది.
2025 ఏప్రిల్ 21న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్ కసిరెడ్డిని వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన కోట్ల మద్యం కుంభకోణంలో నిందితునిగా పేర్కొంటూ అరెస్ట్ చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. రాజ్ కసిరెడ్డి మధ్యం షాపుల సరఫరా, బేవరేజెస్ కంపెనీలతో లంచాల నెట్ వర్క్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈయన నిర్ణయాల ఆధారంగా ఏ బ్రాండ్ల మధ్యం ఎంత మేరకు కొనుగోలు చేయాలి, ఏ రోజు ఏ బ్రాండ్లు విక్రయించాలి అనే విషయాలు నిర్ణయించబడ్డాయని సిట్ దర్యాప్తులో తేలింది. ఈ కుంభకోణం ద్వారా రూ.3000 కోట్లకు పైగా లంచాలు సేకరించి, ప్రభుత్వ ఆదాయాన్ని నష్టపరిచినట్లు ఆధారాలు సెట్ సేకరించినట్లు మీడియా ద్వారా తెలుస్తోంది. సిట్ మాత్రం ఈ వివరాలు వెల్లడించలేదు.
సిట్ ఈయనకు మూడుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాకుండా సాకులు చెప్పారని, హైకోర్టులో నోటీసులను సవాలు చేసినా ఆ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఈయన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసుకొని, వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఈ దందాను నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్
ఆంధ్రప్రదేశ్ లో 2019-2024 మధ్య వైవిస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) 2024 నవంబర్ లో ఏర్పాటు చేశారు. ఈ టీము విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర్ బాబు నేతృత్వం వహిస్తున్నారు.
