అడవి ఏనుగులను నియంత్రించే కుంకి ఏనుగులు
గ్రామ ప్రజల ఆస్తి, ప్రాణ నష్టం నివారణకు దోహదపడతాయి.
ప్రత్యేక శిక్ష్లణ
ఫలించిన ఉప ముఖ్యమంత్రి కృషి
ఏపీ స్టేట్ బ్యూరో
కుంకి ఏనుగులు ఇఫ్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు నాలుగు కుంకీ ఏనుగులను అందజేసింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, మంత్రి ఈశ్వర ఖండ్రే.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వాటికి సంబంధించిన పత్రాలు అందజేశారు. అడవి ఏనుగులను నియంత్రించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన ఈ ఏనుగులను ఉపయోగిస్తారు. అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉండే గ్రామాల్లోకి ఏనుగులు రాకుండా నిరోధించడానికి వీటిని వినియోగిస్తారు.
కుంకీ ఏనుగులు అంటే..?
కుంకీ ఏనుగులు అనేవి ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఏనుగులు. అడవి ఏనుగులను నియంత్రించడానికి, తరిమికొట్టడానికి, లేదా వాటిని పట్టుకోవడానికి ఉపయోగిస్తారు. ‘రాజుల కాలంలో సైనిక కార్యకలాపాల్లో, భారీ పనులు చేయడానికి వీటిని ఉపయోగించేవారు. అడవి ఏనుగులను నియంత్రించడానికి, వాటిని తిరిగి అడవుల్లోకి తరిమేందుకు శిక్షణ పొందిన ఏనుగులను కుంకీలుగా పిలవడం మొదలైంది. మగ ఏనుగులను శారీరకంగా బలంగా ఉంటాయి. అవసరమైతే ఇవి దాడికి దిగిన అటవీ ఏనుగులతో తలపడి వాటిని అదుపు చేయగలవు. అందుకే కుంకీ ఏనుగులుగా మగ వాటినే ఎంపిక చేస్తారు.
గత కొన్నాళ్లుగా అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు జనావాసాల్లోకి ప్రవేశించడం, అడవులకు చేరువగా ఉన్న పంటలను ధ్వంసం చేయడం లాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఏనుగుల దాడిలో ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో కుంకీ ఏనుగులను రంగంలోకి దింపితే.. అవి అడవి నుంచి వచ్చే ఏనుగులను తిరిగి అడవుల్లోకి తరిమికొడతాయి. సంఘర్షణలను తగ్గించడానికి, ప్రాణాలను కాపాడటానికి, పంటలను రక్షించడానికి కుంకీలు ఉపయోగపడతాయి. కుంకీ ఏనుగులను అడవులకు చేరువగా ఉండే ప్రాంతాల్లో ఉంచడం ద్వారా.. సమీపంలోని గ్రామాల్లోకి అటవీ ఏనుగులు రాకుండా చూడవచ్చు.
శిక్షణ ఎలా ఇస్తారు?

కుంకీ ఏనుగులకు శిక్షణ ఇవ్వడమనేది చాలా కష్టంతో కూడుకున్నది. దీనికి ఎంతో సమయం కూడా పడుతుంది. ముందుగా ఏనుగుల గుంపు నుంచి వేరు పడిన లేదా కొన్ని ప్రత్యేక లక్షణాలున్న, వయసులోని మగ ఏనుగులను ఎంపిక చేస్తారు. అరుదుగా ఆడ ఏనుగులను కూడా ఎంపిక చేస్తారు. అయితే అవి చాలా బలంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఇలా ఎంపిక చేసిన ఏనుగులను పట్టుకొని.. వాటిని ప్రత్యేక శిబిరాలను తరలిస్తారు. ముందుగా వాటిని మావటీలు మచ్చిక చేసుకొని.. వాటితో అనుబంధం పెంచుకుంటారు. ఇందుకోసం వాటికి ఇష్టమైన బెల్లం, చెరకు గడలు లాంటి ఆహార పదార్థాలు అందిస్తారు. ఇలా కొంత కాలం చేసిన తర్వాత వాటికి మావటీలపై నమ్మకం ఏర్పడుతుంది. ఆ తర్వాత మావటీలు.. తమ ఆదేశాలు పాటించేలా ఏనుగులకు శిక్షణ ఇవ్వడం మొదలుపెడతారు. కూర్చోమంటే కూర్చోవడం, లేవడం, ముందుకెళ్లడం, వెనక్కి రావడం, ఆగిపోవడం లాంటి మావటీల ఆదేశాలను ఏనుగులు పాటించేలా చూస్తారు. ఇందుకోసం కేవలం మాటలతోనే కాకుండా శబ్దాలు, పాదాలతో ఆదేశాలిస్తారు. అవసరమైతే అంకుశం ఉపయోగిస్తారు.
ఇలా శిక్షణ పొందిన ఏనుగులను శిబిరాల నుంచి బయటకు తీసుకొచ్చి.. అడవులకు తీసుకెళ్తారు. అటవీ ఏనుగుల ప్రవర్తనను గమనించేలా, వాటిని ఎదుర్కునేలా కుంకీ ఏనుగులకు శిక్షణ ఇస్తారు. అడవి ఏనుగులను చూసి ఇవి భయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇతర కుంకీ ఏనుగులతో కలిపి కూడా ట్రైనింగ్ ఇస్తారు. దీని వల్ల అవి ధైర్యంగా ఉంటాయి. ఈ శిక్షణ కూడా ముగిసిన తర్వాత కుంకీ ఏనుగులను ఒంటరిగా అడవిలో వదిలేస్తారు. అవి తమంట తాముగా శిబిరానికి తిరిగి వస్తే.. పూర్తి స్థాయిలో కుంకీ ఏనుగులుగా మారాయని భావిస్తారు. ఈ శిక్షణ ప్రక్రియ ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. వెటర్నరీ డాక్టర్లు, ఫారెస్ట్ అధికారుల పర్యవేక్షణలోనే ఈ ట్రైనింగ్ ఇస్తారు. కుంకీ ఏనుగులు మావటీలు ఇచ్చే ఆదేశాలకు కచ్చితంగా లోబడి ఉంటాయి. అవి అడవి ఏనుగుల భాషను అర్థం చేసుకుని.. మావటీల హెచ్చరికలను అడవి ఏనుగులకు చేరవేస్తాయి. తద్వారా మనుషులు, అటవీ ఏనుగుల మధ్య ఘర్షణ తలెత్తకుండా చూస్తాయి. ఏపీలో కుంకీల అవసరం ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు ఒడిశాతో సరిహద్దును పంచుకునే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేస్తున్న ఘటనలు ఇటీవల తరచుగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈ జిల్లాల్లో కుంకీ ఏనుగులను ఉపయోగించి.. అడవి ఏనుగులను తరిమికొట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
