కృత్రిమ మేధ (ఏఐ)తో కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తాయని, తద్వారా పని స్వభావంలో మార్పులు వస్తాయని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఏఐ గ్లోబల్ హెడ్ అశోక్ క్రిష్ తెలిపారు. నైపుణ్యాల అభివృద్ధికి చోదకంగా ఏఐను పరిగణించాలని, ఉద్యోగాలకు ముప్పుగా చూడరాదని అన్నారు. కంపెనీల్లో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఏఐను ఒక ఐటీ ప్రాజెక్టుగా చూడటం లేదని, బోర్డు స్థాయి ప్రాధాన్యంగా మారిందని తెలిపారు. ఏఐ అనేది కేవలం ఒక సాంకేతిక మార్పు కాదని, ఉద్యోగులు పనిచేసే తీరును మార్చే ఒక సాంస్కృతిక మార్పు అని వివరించారు. గత మూడు దశాబ్దాల్లో మెయిన్ఫ్రేమ్స్ నుంచి ఇంటర్నెట్ వరకు.. ఆ తర్వాత ఇ-కామర్స్, డిజిటల్, క్లౌడ్ వంటి సాంకేతిక పరమైన మార్పులు వచ్చాయని.. భారీ మార్పులు చోటుచేసుకున్న ప్రతిసారీ, భవిష్యత్పై ఉద్యోగులకు కొత్త భయాలు రావడం సహజమేనన్నారు. ఏఐ భవిష్యత్తు విప్లవమని, తద్వారా మరిన్ని టెక్నాలజీలు వస్తాయని, ప్రక్రియలు సులభతరం అవుతాయని అశోక్ క్రిష్ పేర్కొన్నారు. ఈ సాంకేతికత వల్ల ఉద్యోగాలు పోతాయనే భయాలు వదిలేసి, నైపుణ్యాలు పెంచుకుని ముందుకు సాగేందుకు ప్రయత్నించాలని ఉద్బోధించారు. ‘ప్రస్తుతం ఒక ప్రాజెక్టులో 100 మంది పనిచేస్తుంటే, ఏఐ వల్ల 50 మంది సరిపోవచ్చు. అయితే మరిన్ని కొత్త ప్రాజెక్టులు/సేవలకు అవకాశం ఉంటుందన్నది గమనించాలి’ అని వివరించారు. గత దశాబ్దిలోనే/మానవ చరిత్రలోనే అతిపెద్ద సాంకేతిక విప్లవంగా ఏఐని చూడొచ్చనీ పేర్కొన్నారు. హ్యూమనాయిడ్ రోబోటిక్స్ కంపెనీలు, సమాజంలో పెనుమార్పులకు కారణమవుతాయని తెలిపారు.
