ఎం.గణేశ్, ఏపీ ఎనాలిసిస్
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ సుస్ధిరమైన పాలన కొనసాగడానికి కాపు సామాజిక వర్గం ప్రధాన కారణమని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వల్లనే మూడు పార్టీల కూటమి ఏర్పడిందని, దీని వలన పటిష్టమైన, సుస్ధిర పాలన కొనసాగుతోందన్నారు. కేంద్రం నుంచి ఏపీకి అత్యధిక నిధులు, ప్రాజెక్టులు తీసుకువచ్చే అవకాశం కాపు సామాజికవర్గం వల్లనే సాధ్యమైందన్నారు. ఈ విషయాన్ని మన సామాజికవర్గం గుర్తించాలన్నారు. రాయల్ క్లబ్ విజయవాడ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారనికి సుబ్బారాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం సంయుక్త కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. నున్నలో కాపుల కళ్యాణ మండప నిర్మాణానికి ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు తో మాట్లాడుతానని స్పష్టం చేశారు. రాయల్ క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. ఇతర సామాజికవర్గాలతో మనం పోటీపడి అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలన్నారు.

రాజకీయంగా ముఖ్య భూమిక వహించిన నాడే కాపు సామాజికవర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందని, ఆ దిశగా కాపులు అధిక సంఖ్యలో రావాలని ఏపీ ఎస్ ఎం ఇ చైర్మన్ టి. శివశంకర్ పిలుపునిచ్చారు. ఏపీలో కాపులు సంఖ్యాపరంగా అధికంగా ఉన్నప్పటికీ రాజకీయంగా ముందుకు వెళ్లలేకపోతున్నారని, ఇతర రాష్ట్రాల్లో కొన్ని సామాజికవర్గాలు తక్కువుగా ఉన్నప్పటికీ రాజ్యాధికారాన్ని పొందారన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని కాపు సామాజిక వర్గం రాజకీయాల్లోకి చొచ్చుకురావాలన్నారు. ఏపీఎస్ఎంఇ అనేక పథకాలను అమలు చేస్తుందని, వీటి పట్ల ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి తాను జిల్లాల్లో కార్యక్రమాలు చేస్తున్నానని, వాటి ఫలితాలు పొందడానికి కాపులు ముందుకు రావాలన్నారు.

ఏపీలో ఒక సామాజికవర్గం ఫ్రస్తుతం అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉందని, దానిని ఆదర్శంగా తీసుకోవాలని తులసీ ఇండస్ట్రీస్ అధినేత తులసీ రామ చంద్రబాబు పిలుపునిచ్చారు. విద్యతోనే ఏదైనా సాధ్యమౌతుందని, అందుకే తాను కాపు సామాజికవర్గంలోని పేదవారైన మెరిట్ విద్యార్ధులను ప్రోత్సహించేందుకు ఉపకార వేతనాలు అందిస్తున్నానని తెలిపారు. కాపు విద్యార్ధులకు హాస్టల్స్ నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి తాను కాపు సామాజికవర్గానికి తన వంతు సాయం చేస్తున్నానని చెప్పారు. తన పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగులు కాపు సామాజికవర్గం వారే ఉన్నారని, ఈ విధానాన్ని కాపు వ్యాపారస్తులు, పారిశ్రామిక వేత్తలు పాటించాలని కోరారు.
హోటల్ రంగంలో ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువుగా ఉన్నాయని, వీటిని కాపు సామాజికవర్గం అందిపుచ్చుకోవాలని వెస్టిన్ గ్రూఫ్ ఆఫ్ కాలేజీస్ చైర్మన్ డాక్టర్ కోటి దుర్గా ప్రసాద్ కోరారు. రాయల్ క్లబ్ కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తూనే ఉన్నానని, మరిన్ని అవకాశాలను కాపు సామాజికవర్గం అందిపుచ్చుకోవాలని కోరారు. రాయల్ క్లబ్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ చినమిల్లి సత్యనారాయణ కొత్త పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాయల్ క్లబ్ అసోసియేషన్ ఫౌండర్ పేటేటి పుల్లయ్య, ఇతర సభ్యులు శీతాలం రాంబాబు,ఆర్ వి సుబ్బారావు, తోట పద్మనాభరావు, ఇమదాబత్తుల నరహరి, కె.భాస్కర్ కుమార్, బి.రంగనాధ్, డాక్టర్ ఇట్ల రవి తదితరులు ప్రసంగించారు.
—
