సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ఏపీ ఎనాలిసిస్, విజయవాడ.
సీనియర్ జర్నిలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావుకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ దక్కింది. వెంటనే కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలని ఆదేశించింది. కొమ్మినేని అరెస్ట్ పైన దాఖలైన పిటీషన్ ను న్యాయస్థానం విచారణ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలు ట్రయల్ కోర్టు ఇస్తుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సమయంలో కొమ్మినేనికి కొన్ని స్పష్టమైన సూచనలు చేసింది. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, ప్రోత్సహించే విధంగా ప్రవర్తించవద్దని హెచ్చరించింది. భవిష్యత్ లో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. కేసుల విచారణ వేళ కొన్ని సందర్భాల్లో తాము కూడా నవ్వుతూ ఉంటామని వ్యాఖ్యానించింది. అంతమాత్రానా ఏదో తప్పు చేసినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించింది. 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించింది. చర్చలను గౌరవ ప్రదంగా చేయాలని కోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంలో దాఖలు చేసిన పిటీషన్ లో కొమ్మినేని పలు అంశాలను ప్రస్తావించారు. 41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసారని పేర్కొన్నారు. లైవ్ షో లో గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారని ప్రస్తావించారు. కొమ్మినేని కి ఎలాంటి నేర చరిత్ర లేదని వివరించారు. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని పిటీ షన్ లో ఆరోపించారు. చర్చలో భాగంగా గెస్ట్ ను కొమ్మినేని నియంత్రించే ప్రయత్నం చేసారని.. వాటిని సమర్ధించలేదని వివరించారు. 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్ గా పేర్కొన్నారు. కాగా, ఈ పిటీషన్ విచారణ తరువాత సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
