ప్రజలతో టీడీపీ మమేకం
ఏడాది పాలన పూర్తయిన నేపధ్యం
కొత్త నిర్ణయాలు
M.GANESH, VIJAYAWADA.
టీడీపీ ప్రజలకు మరింత చేరువకావాలని భావిస్తుంది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపధ్యంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రజలకు అందించిన పథకాలు, చేసిన పనులపై సింహావలోకం చేసుకుంది. కొన్ని సమయాల్లో జరిగిన లోటుపాట్లు, ప్రజల్లో నెలకొంటున్న వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుంటున్నది. కొన్ని దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తున్నది. ప్రజల పరంగా పార్టీ హవా తగ్గకూడదన్న వ్యూహాన్ని అమలు చేస్తుంది.
ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ పార్టీ అధినేత చంద్రబాబు ఆశిస్తున్న స్థాయిలో ప్రజల నుంచి ప్రభుత్వంపై రియాక్షన్ ఉండడం లేదు. నిజానికి చంద్రబాబు ఇప్పటికే చేయించిన సర్వేల్లో 80 శాతం సంతృప్తి ఉందని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో నాయకులకు అంత మొత్తంలో సానుకూలత లేదన్న విషయం తరచుగా చర్చకు వస్తోంది. దీని వల్ల పై స్థాయిలో ఎంత చేసినా.. రేపు ఎన్నికల సమయానికి ఇబ్బందులు తప్పవన్న అంచనాలు ఉన్నాయి.

ప్రధానంగా ఎన్నికల వరకు వేచి చూడకుండా.. సంక్షేమ పథకాలపై అసంతృప్తి ఉన్నవారిని, పథకాలు అందని వారిని కూడా గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఎమ్మెల్యేలకు-ప్రజల మధ్య గ్యాప్ ని తగ్గించేందుకు చర్యలు తీసుకోడానికి ఉపక్రమిస్తోంది. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో చంద్రబాబు గ్రాఫ్ పెరిగినా, ఎన్నికల విషయానికి వస్తే.. చంద్రబాబును చూసి వేసే వారికంటే.. స్ధానిక నాయకులను చూసి ఓటేసేవారు పెరుగుతారన్న అంచనా ఉంది.. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలను యాక్టివ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే గడపగడపకు కార్యక్రమాన్ని విజయంవంతం చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. గడపగడపకు తిరిగే నాయకులు.. కేవలం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలే కాకుండా.. తమ నియోజకవర్గం పరిధిలో ఏడాది కాలంలో చేసిన ప్రగతిని వివరించాలనేది ప్రధాన కాన్సెప్టు. ప్రజలతో తమకు ఉన్న సంబంధాలను మెరుగు పరిచేందుకు దీనిని వినియోగించుకోనున్నారు. జూలై 1 నుంచి రాష్ట్రంలో కొత్త మార్పు దిశగా టీడీపీ అడుగులు వేయనుంది.
