డీజీపీ కోర్టులో బంతి…
రఘురామ – పీవీ సునీల్ వార్ ఎటు?
తెరవెనుక వైసీపీ రాజకీయం
ఎం.గణేశ్, జర్నలిస్టు
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు – ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ మధ్య వివాదం కీలక దశకు చేరుకుంది. పరస్పర ఆరోపణలు, చట్టపరమైన దాడులు, సోషల్ మీడియా పోస్టులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. కాగల కార్యం గంధర్వులు తీర్చుతున్నారే అనే రీతిలో వైసీపీ నేతలు చంకలు కొట్టుకుంటున్నారు. ఈ వివాదం టీడీపీ ప్రతిష్టకు నష్టం కలిగిస్తుందనే ఆందోళనో ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ కస్టడీలో తనను హింసించారంటూ రఘురామకృష్ణంరాజు న్యాయపోరాటానికి దిగడం, ఆ కేసులో అప్పటి సీఐడీ అధికారి పీవీ సునీల్ కుమార్పై విచారణకు దారి తీసేలా చేయడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ పరిణామం తర్వాతే బ్యాంకులను మోసం చేసిన కేసులో రఘురామకు సుప్రీంకోర్టు నుంచి ఎదురైన షాక్ ఆయనకు రాజకీయంగా కొత్త చిక్కులు తెచ్చింది. ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకుని పీవీ సునీల్ సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టడం, రఘురామను టార్గెట్ చేయడం వివాదాన్ని మరింత వేడెక్కించింది. ఇక్కడితో ఆగకుండా, గతంలో ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన వ్యవహారంలో తనను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు బ్యాంకు మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న రఘురామకృష్ణంరాజును కూడా డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తప్పించాలని పీవీ సునీల్ డిమాండ్ చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. దీనిపై రఘురామ తీవ్రంగా స్పందించడంతో మాటల యుద్ధం సోషల్ మీడియా యుద్ధంగా మారింది. వాస్తవాలు, ఆధారాలు ఉన్నాయంటూ పీవీ సునీల్ వరుస పోస్టులు, వీడియోలతో ఎదురుదాడి కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రఘురామ వ్యూహం మార్చారు. అఖిల భారత సర్వీసు నిబంధనలను ఉల్లంఘిస్తూ ఒక ఐపీఎస్ అధికారి రాజకీయ నేతపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ పీవీ సునీల్ కుమార్ను సర్వీస్ నుంచి తొలగించాలని కోరుతూ డీజీపీ హరీష్ గుప్తాకు లేఖ రాశారు. పీవీ సునీల్ ఎక్స్లో పెట్టిన పోస్టులు, వీడియోలను ఆధారాలుగా జత చేయడంతో ఈ వివాదం అధికారికంగా పోలీసు ఉన్నతాధికారుల పరిధిలోకి వెళ్లింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారంలో తదుపరి అడుగు ఏమిటన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి డీజీపీ ముందుంది. అయితే పీవీ సునీల్పై చర్యలు తీసుకోవడం అంత సులువు కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆయనకు మద్దతుగా ఇప్పటికే దళిత సంఘాలు రంగంలోకి దిగడంతో, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది రాజకీయంగా, సామాజికంగా ఎలాంటి ప్రభావం చూపుతుందన్న ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అందుకే నేరుగా చర్యలకు దిగకుండా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తదుపరి నిర్ణయం తీసుకునే దిశగా డీజీపీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు రఘురామకృష్ణంరాజు రాజకీయ ప్రయాణం కూడా ఈ వివాదానికి అదనపు బరువు పెడుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఎన్నికై, ఆ తర్వాత జగన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ‘రెబెల్ ఎంపీ’గా పేరు తెచ్చుకున్న ఆయన, అనంతరం కూటమి తరఫున పోటీ చేసి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ స్పీకర్ పదవికి చేరుకున్నారు. కానీ తాజా వివాదాలతో ఆయనపై చర్యలు తీసుకుంటే కూటమి ప్రభుత్వానికి ఒక తలనొప్పి, వదిలేస్తే మరో తలనొప్పి అన్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి రఘురామ – పీవీ సునీల్ వార్ ఇప్పుడు రాజకీయాలు, పాలన, పోలీసు వ్యవస్థ అన్నింటినీ తాకే స్థాయికి చేరింది. ఈ పోరులో ఎవరి దాడి ఎంతదూరం వెళ్తుందన్నది కాదు, చివరకు డీజీపీ తీసుకునే నిర్ణయం ఏ దిశగా మలుపు తిప్పుతుందన్నదే ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.
