అధిక రక్తపోటును తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అయితే తగినంత నీరు తాగటం అలవాటు చేసుకోండి. రక్తంలో సోడియం మోతాదులు నార్మల్లో గరిష్ఠ స్థాయికి దగ్గరలో ఉండటానికీ అధిక రక్తపోటు, గుండె వైఫల్యం ముప్పులు పెరగటానికీ సంబంధం ఉంటున్నట్టు ఇజ్రాయెల్లోని బార్-ఇలాన్ యూనివర్సిటీ హెచ్చరిస్తోంది. పరిశోధకులు నాలుగు లక్షలకు పైగా మంది ఆరోగ్య వివరాలను సమీక్షించి ఈ విషయాన్ని గుర్తించారు. తగినంత నీరు తాగితే సహజంగానే సోడియం సాంద్రత తగ్గుతుంది. దీన్ని చిన్న విషయంగా భావించటం తగదని, ఇది దీర్ఘకాల గుండెజబ్బుల నివారణకు సమర్థమైన మార్గమని చెబుతున్నారు. రక్తంలో సోడియం మోతాదులు 135-146 ఎంఎంఓఎల్/ఎల్ ఉండటం నార్మల్గా భావిస్తారు. ఇవి పైస్థాయికి చేరుకోకముందే ముప్పులు పెరుగుతుండటం గమనించదగ్గ విషయం. సోడియం మోతాదులు 140 నుంచి 146 ఎంఎంఓఎల్/ఎల్ ఉన్నవారికి అధిక రక్తపోటు, గుండె వైఫల్యం తలెత్తే అవకాశం పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వయసు, లింగ భేదం, శరీర ఎత్తు బరువు నిష్పత్తి, పొగ తాగే అలవాటు, పొటాషియం మోతాదుల వంటి వాటిని పక్కనపెట్టి చూసినా వీటి మధ్య సంబంధం కనిపిస్తుండటం విశేషం. సోడియం మోతాదులు 143 ఎంఎంఓఎల్/ఎల్ కన్నా మించగానే అధిక రక్తపోటు ముప్పు 29%, గుండె వైఫల్యం ముప్పు 20% పెరుగుతున్నట్టు తేలింది. ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవటం చాలా కీలకమని ఇది తెలియజేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. దీర్ఘకాల జబ్బుల నివారణకిది తేలికైన, సమర్థ మార్గమని వివరిస్తున్నారు. ఎందుకంటే ఒంట్లో నీటిశాతం తగ్గితే రక్తంలో సోడియం మోతాదులూ పెరుగుతాయి. అందుకే అధిక రక్తపోటు, గుండెజబ్బుల ముప్పును అంచనా వేయటానికి రక్తంలో సోడియం మోతాదులను తెలిపే పరీక్ష చవకైన, తేలికైన మార్గంగానూ ఉపయోగపడగలదని పరిశోధకులు సూచిస్తున్నారు. మగవారు రోజుకు సుమారు 3.7 లీటర్లు, ఆడవారు 2.7 లీటర్ల నీరు తాగాలని ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. అయితే ఆయా వ్యక్తుల ఆరోగ్యం, చేసే పనులు, వాతావరణాన్ని బట్టి నీటి అవసరం మారుతూ వస్తుంది.
