అన్ని నియోజకవర్గాల నుంచి తరలిరానున్న ప్రజలు
అందరికీ భోజన సౌకర్యం
భూములు ఇచ్చిన రైతులకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం
ఏపీ స్టేట్ బ్యూరో.
అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభానికి విచ్చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుండి ప్రజలు తరలి రానున్నారు. వేసవి దృష్ట్యా సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రతి బస్సుకు ఒక ప్రభుత్వ అధికారిని ఇన్ ఛార్జిగా నియమించడంతోపాటు 25 బస్సులకు ఒక ప్రత్యేక ఇన్చార్జి అధికారిని నియమించింది. ఎక్కడా ఎటువంటి ఆటకం కలగకుండా ప్రజలను సభా స్థలికి చేర్చే విధంగా తగిన ఏర్పాట్లు చేసింది.
బస్సులు బయలుదేరే సమయంలోనే ఆల్పాహారం, తాగునీరు, దారి మధ్యలో మధ్యాహ్న భోజనం కల్పించడంతోపాటు సభా ప్రాగణంలో ఏర్పాటు చేసిన వివిధ పార్కింగ్ ప్రాంతాల్లో కూడా భోజన వసతి కల్పించింది. సభానంతరం తిరిగి వారి గమ్యస్థానాలకు బయలుదేరే ముందు రాత్రి భోజనం కూడా అందించనున్నది. పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు. రాజధాని కార్యక్రమం మనది అనే భావన అందరిలో కలిగేలా తగిన ఏర్పాట్లు చేసింది.
అమరావతి రాజధాని నిర్మాణానికి 29 గ్రామాల ప్రజలు సుమారు 34 వేల ఎకరాలను ఇచ్చారు. వారందరినీ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తున్నది. అమరావతి రాజధాని నిర్మాణంతో ప్రజల ఆర్ధిక స్థితి మెరుగుపడుతుందనే ఆశ అందరిలో కనపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడి కార్యక్రమానికి గతంలో ఎన్నడూ లేని రీతిలో అద్భుతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది.
