డిసిఎంఎస్ చైర్మన్ పదవి తో ఊరట…
ఢిల్లీ నుంచి మచిలీపట్నం వచ్చిన ఆర్కే…
గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బందరుకు ర్యాలీ…
జనసైనికుల్లో ఆనందోత్సవాలు….
ఏపీ ఎనాలిసిస్, విజయవాడ.
పార్టీ ఏ పని అప్పగించినా కాదనకుండా వెనకడుగు వేయకుండా బండెడు బరువు మోసిన జనసేన నాయకులు బండి రామకృష్ణ కు సముచిత స్థానం లభించింది. నామినేటెడ్ పదవులు భర్తీలో భాగంగా ఆయనకు డీసీఎంఎస్ చైర్మన్ పదవి లభించింది. నిన్నటి వరకు ఢిల్లీలో ఉన్న ఆయన మంగళవారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకోగా అక్కడ నుంచి మచిలీపట్నం వరకు ర్యాలీగా తరలివచ్చారు. జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న బండి రామకృష్ణ కు డి సి ఎం ఎస్ పదవి దక్కడంతో జిల్లా వ్యాప్తంగా జనసైనికుల్లో ఆనందోత్సవాలు వ్యక్తం అవుతున్నాయి.
మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ బండి రామకృష్ణకు కీలక పదవి లభించింది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి మచిలీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ను బండి రామకృష్ణ ఆశించారు . పొత్తులో భాగంగా మచిలీపట్నం సీటును టిడిపి అభ్యర్థి కోలరేంద్రకు కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో అప్పటినుంచి నామినేట్ పదవి కోసం ఎదురు చూస్తున్న రామకృష్ణను కృష్ణాజిల్లా సహకార మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వీలు ఇచ్చింది.రామకృష్ణ నియామకం పట్ల జనసైనికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మచిలీపట్నంకు చెందిన రామకృష్ణ చిన్నప్పటి నుండి స్వయం కృషితో కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. వ్యాపార వర్గంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్న రామకృష్ణ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి 2019లో జనసేన పార్టీలో చేరారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మచిలీపట్నం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తొలిసారి పోటీ చేసి ఓడిపోయినా ఆ ఎన్నికల్లో 18వేల ఓట్లను సాధించారు. పార్టీలోకి వచ్చిన రోజు నుండి పార్టీ కార్యకలాపాల్లో విస్తృతంగా పాల్గొంటూ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశారు. 2023 మార్చి నెలలో మచిలీపట్నంలో జరిగిన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభను విజయవంతం చేయడంలో రామకృష్ణ ప్రత్యేక పాత్ర పోషించారు. ఆ సభ విజయంతో పవన్ కళ్యాణ్ కు ఆయన మరింత దగ్గరయ్యారు.పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వారాహి యాత్రలో ఫుడ్ కమిటీ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారు. 2024 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా మచిలీపట్నం అసెంబ్లీ టికెట్ ఆయన కోల్పోవాల్సి వచ్చింది. కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన కొల్లు రవీంద్ర విజయంలో ఆర్కే కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏడాది కావస్తున్నా రామకృష్ణకు సముచిత స్థానం దక్కలేదనే వెలితి జనసైనికుల్లో వుండేది .ఈ సమయంలో ఆయన్ను జిల్లా సహకార మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ గా నియమించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్త మవుతున్నాయి.
