ప్రభుత్వ, ప్రైవేట్ సంస్ధల సర్వే
41 మంది శాసన సభ్యుల పనితీరుపై విమర్శలు
ఏపీ ఎనాలిసిస్, విజయవాడ.
తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మార్కు పాలనకు మళ్లీ తెర లేపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల జాతకాలు తన గుప్పెట్లో పెట్టుకున్నారు . ఏడాది కాలంలో ఎమ్మెల్యేల పనితీరుపై అధ్యయనం చేయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల వారీగా నివేదికలు సేకరించారు. ప్రైవేటు సర్వే సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేల పని తీరుకు ర్యాంకులు కేటాయిస్తున్నారు. ఇదంతా చంద్రబాబు మార్కు పాలనకు సంకేతాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సర్వే నివేదికలు బహిర్గతం కానప్పటికీ అంతర్గతంగా సంచలనం రేపుతున్నాయి .రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉండగా గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 164 సీట్లు వచ్చాయి. వీటిలో అత్యధికంగా తెలుగుదేశం పార్టీ 135 నియోజకవర్గాల్లో గెలుపొందగా 21 స్థానాల్లో జనసేన ఎనిమిది స్థానాల్లో బిజెపి అభ్యర్థులు విజయం సాధించారు . 11 సీట్లకు పరిమితమైన వైసీపీ పరిస్థితిని అంచనా వేసుకుంటూ భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని తన మార్కు పాలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.
దానిలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా కూటమి ఎమ్మెల్యేలపై ఇటీవల కొన్ని సర్వే సంస్థలు నివేదికలు సమర్పించినట్టు వినికిడిగా ఉంది. కూటమి కి చెందిన 164 మంది ఎమ్మెల్యేలలో 41 మంది పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నట్టుగా నివేదికలు సమర్పించినట్టు విశ్వసినీయ సమాచారం. అవినీతి, అడ్డగోలు వ్యవహారాలు, అధికార దుర్వినియోగం వగైరా దుశ్చర్యలకు ఈ నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు నిత్యం పాల్పడుతున్నట్టు ఆయా నివేదికలు తెలియజేసుకుతున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతుంది . ఆ 41 మంది ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నప్పటికీ సర్వే నివేదికలు బహిర్గతం చేయకుండా సున్నితంగా హెచ్చరిస్తున్నట్టు తెలుస్తుంది. కేవలం ఏడాది కాలం మాత్రమే గడవడంతో ఇకపై వీరిలో మార్పును ఆశించి తొలి హెచ్చరిక జారీ చేసినట్లుగా కూటమి నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు.
ఇదే రీతిలో పనితీరు మెరుగ్గా ఉన్న వారి నివేదికలు సేకరించారు . జిల్లాల వారీగా టాప్ టెన్, టాప్ ఫైవ్ , టాప్ త్రీ జాబితాలు చంద్రబాబు చేతికి చేరినట్టు తెలుస్తుంది. వారి పనితీరు మరింత చక్కదిద్దేందుకు సీఎం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వీరిలో ఉమ్మడి కృష్ణా జిల్లా కు సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు తెరపైకి వచ్చాయి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ వున్నారు. వీరిలో గద్దె రామ్మోహన్ కాగిత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సుజనా చౌదరి బిజెపి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఈ 16 చోట్ల కూటమి అభ్యర్థులే గెలుపొందారు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోగల ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ గెలుపొందగా మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారు . అలాగే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బిజెపి అభ్యర్థి సృజనా చౌదరి గెలుపొందగా మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోగల నూజివీడు, ,కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కెపి సారథి , కామినేని శ్రీనివాస్ విజయం సాధించారు. వీరిలో కె పీ సారథి టిడిపి కాగా కామినేని బిజెపి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాలు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి .
అదే విధంగా గుంటూరు జిల్లాలో టాప్ ఒన్ లో నిలిచిన ఎమ్మెల్యేగా ధూళిపాళ్ల నరేంద్ర రికార్డు నెలకొల్పగా ప్రకాశం జిల్లాలో విద్యుత్ శాఖ మంత్రి రవి కొండేపి స్వామి తదితరులు ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో రాధాకృష్ణ, మద్దిపట్ల వెంకటరాజు , నిమ్మల రామానాయుడు ముందు వరుసలోకి వచ్చినట్టు సర్వే నివేదికలు చెబుతున్నాయి. ఇకపై ఎమ్మెల్యేలంతా జాగరూకతతో ఉండాలనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
