ఎం.గణేశ్, విజయవాడ
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనలు మామూలు రేంజ్ లో ఉండటం లేదు. అవకాశం వచ్చిన ప్రతీసారీ కేంద్రానికి అనేక వినతి పత్రాలు ఇస్తున్నారు. వాటిలో పోలవరం, అమరావతిలతోపాటు అంతకుమించి ప్రతిపాదనలు, వినతలు ఉంటున్నాయి. ఇచ్చిన వినతి పత్రాలన్నింటికీ కేంద్రం ఆమోదించక పోవచ్చు. అయితే బాబు సంకల్ప బలం ఏపీ ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తుంటే, ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులకు కలవరం కలిగిస్తున్నాయి. కేంద్రంలో తనకున్న పలుకుబడితో తమ రాష్ట్రంలోని పరిశ్రమలు, ప్రాజెక్టులకు ఎటువంటి ముప్పు తీసుకువస్తారో అనే ఆందోళన వారిలో లేకపోలేదు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో బాబు కేంద్రంలోని ముఖ్యులను కలుసుకున్నారు. ఆయన ఇచ్చిన పెద్ద పెద్ద ప్రతిపాదనలకు కేంద్ర మంత్రులకు దిమ్మి తిరిగిపోయిందనే అభిప్రాయం వినపడుతోంది. మరీ ముఖ్యంగా ఏపీలో భారత రక్ష్లణ దళానికి సంబంధించిన ప్రతిపాదనలు చర్చనీయాంశం అయ్యాయి. విభజన తరువాత ఏపీలో రక్ష్లణ దళానికి సంబంధించిన ప్రాజెక్టులను ఏపీకి కేంద్రం మంజూరు చేయకపోవడాన్ని బాబు ప్రస్తావించారు. అటువంటి వాటిని మాకు కేటాయిస్తే వేలాది ఎకరాలను కేటాయిస్తానని కేంద్ర మంత్రులకు చెప్పి వచ్చారు. వివరాల్లోకి వెళితే..

హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తయారు చేస్తున్న ఐదవ తరం అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA), లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (LCA) ఉత్పత్తిని కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్కు మార్చాలని ప్రతిపాదించారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో చర్చలు జరిపారు.

బెంగళూరు విమానాశ్రయం సమీపంలో HAL AMCA సౌకర్యం కోసం భూమిని ఇప్పటికే గుర్తించారు. కానీ, ఈ ప్రాజెక్ట్ను కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్కు మార్చాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. దీనికోసం 10 వేల ఎకరాల స్థలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దానితోపాటు ఆంధ్రప్రదేశ్ అంతటా రక్షణ పారిశ్రామిక కారిడార్ను నిర్మిస్తామని కూడా తెలిపారు. ఈ ప్రాజెక్ట్లో వైమానిక దళ కేంద్రాలు, నౌకాదళ పరికరాల పరీక్ష, డ్రోన్ ఉత్పత్తి కేంద్రాలు కూడా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ను రక్షణ ఉత్పత్తికి జాతీయ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనను సమర్పించారు. స్థానిక రక్షణ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని రక్షణ మంత్రికి తెలిపారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్లో భారతదేశ మూడవ రక్షణ పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అధునాతన సైనిక పరికరాల ఉత్పత్తికి పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.
అలాగే, జగ్గయ్యపేట-దోలకొండ క్లస్టర్లోని 6,000 ఎకరాల ప్రాంతాన్ని క్షిపణులు-మందుగుండు సామగ్రి రక్షణ కేంద్రంగా మార్చాలని చంద్రబాబు ప్రతిపాదించారు. శ్రీహరికోట ప్రాంతంలో, ప్రైవేట్ ఉపగ్రహ ఉత్పత్తి, ప్రయోగ సౌకర్యాల కోసం 2,000 ఎకరాల క్లస్టర్ను ప్రతిపాదించారు. లేపాక్షి-మడకశిర క్లస్టర్లో, సైనిక-పౌర విమానాలు-ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి కేంద్రాలను ప్రతిపాదించారు.

విశాఖపట్నం-అనకాపల్లిలో నౌకాదళ పరీక్షా కేంద్రాలను, కర్నూలు-ఒర్వకల్లులో సైనిక డ్రోన్లు, రోబోటిక్స్-అధునాతన రక్షణ భాగాల ఉత్పత్తిని ప్రతిపాదించారు. అలాగే, ఐఐటి తిరుపతిలో DRDO ఎక్సలెన్స్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు రాజ్నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఏపీ పారిశ్రామికంగా మరింత ప్రగతితో దూసుకుపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
