ఏపీ స్టేట్ బ్యూరో..
కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతింటి గృహప్రవేశం చేశారు. శాస్ర్తోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సతీమణి తన సంతోషాన్ని సోషల్ మీడియాను వేధికగా చేసుకుని వ్యక్తం చేశారు. ఆమె మాటల్లోనే… కుప్పంలో సొంతింటి గృహప్రవేశ కార్యక్రమం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. 36 ఏళ్లుగా మా కుటుంబానికి అండగా ఉంటూ…మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మాకు ఆత్మబంధువులైన కుప్పం ప్రజల ఆశీస్సుల నడుమ గృహప్రవేశం జరిగింది.

కల్మషం లేని మంచి మనుషుల మధ్య…మా కుటుంబ సభ్యులుగా భావించే ప్రజల ఆశీర్వాదంతో జరిగిన కార్యక్రమం ఎంతో సంతృప్తినిచ్చింది. సొంతింటి పండుగలా నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల మధ్య జరిగిన ఈ శుభకార్యం నాకు ఎన్నటికీ గుర్తుండిపోతుంది. కుప్పం నియోజకవర్గ ప్రజల దీవెనలకు, ఆత్మీయతకు, అభిమానానికి, మద్దతుకు శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతున్నాను
