టాప్ అడ్వాన్స్ ట్యాక్స్ పేయర్ల (ఎక్కువ మొత్తంలో ముందస్తుగా పన్ను చెల్లిస్తున్న వారు)ను దగ్గరగా పర్యవేక్షించాలని ఆదాయపు పన్ను (ఐటీ) విభాగానికి సీబీడీటీ (కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి) ఆదేశాలు జారీ చేసింది. అలాగే మినహాయింపులు, తగ్గింపులు కోరుతూ చేసే బోగస్ క్లెయిమ్లను గుర్తించడం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లను పెంచే వ్యూహాన్ని అనుసరించాలని సూచించింది. సీబీడీటీ ఇటీవల 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర కార్యాచరణ ప్రణాళిక (సీఏపీ)ను విడుదల చేసింది. ఇది ఆదాయ సేకరణకు సంబంధించి విభాగంలో కీలక పనితీరు ప్రాంతాలను నడిపించడానికి మార్గదర్శకంగా పని చేస్తుందని తెలిపింది.
ఫిబ్రవరిలో సమర్పించిన బడ్జెట్ అంచనాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల విభాగం కింద ఐటీ విభాగానికి కేంద్ర ప్రభుత్వం రూ.25.20 లక్షల కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందులో రూ.10.82 లక్షల కోట్లు కార్పొరేట్ పన్ను, రూ.13.6 లక్షల కోట్లు కార్పొరేట్యేతర పన్ను (వ్యక్తిగత ఆదాయపు పన్ను తదితరాలు), రూ.78,000 కోట్లు సెక్యూరిటీల లావాదేవీ పన్ను (ఎస్టీటీ) ఉన్నాయి. 2024-25లో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.22.37 లక్షల కోట్లుగా ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించగా, స్వల్పంగా తగ్గి రూ.22.26 లక్షల కోట్లు వసూలైంది.
