వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ప్రాథమిక విచారణ జరిపిన ఈడీ అధికారులు.. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద అభియోగాలు మోపి, తాజాగా ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఈసీఐఆర్) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసులో 33 మందిని నిందితులుగా చేర్చారు. వైకాపా ప్రభుత్వ పెద్దల తరఫున మద్యం కుంభకోణంలో అన్నీ తానై వ్యవహరించిన రాజ్ కెసిరెడ్డితో పాటు వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం సీఎంవో కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలతో పాటు ఏపీఎస్బీసీఎల్ పూర్వపు ఎండీ డి.వాసుదేవరెడ్డి, ఏపీఎస్బీసీఎల్ ప్రత్యేకాధికారి సత్యప్రసాద్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ పూర్వపు డైరెక్టర్ సజ్జల శ్రీధర్రెడ్డి, మద్యం ముడుపుల వసూళ్లలో కీలకంగా వ్యవహరించిన రాజ్ కెసిరెడ్డి తోడల్లుడు ముప్పిడి అవినాష్రెడ్డి, వీరి అనుచరులు బూనేటి చాణక్య, టి.కిరణ్కుమార్రెడ్డి, సైఫ్ అహ్మద్తో పాటు మద్యం ముడుపుల సొత్తు రూటింగ్ కోసం వినియోగించిన పలు డొల్ల సంస్థల యాజమాన్యాలను నిందితులుగా ఈడీ చేర్చింది. వీరందరికీ నోటీసులిచ్చి విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద మద్యం కుంభకోణం కావటంతో పాటు సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి వసూలు చేసిన దాదాపు రూ.3,200 కోట్ల ముడుపులను కల్పిత, ఊహాజనిత కంపెనీల ద్వారా వివిధ దశల్లో రూటింగ్ చేసి అంతిమ లబ్ధిదారుకు చేర్చినట్లు ప్రాథమికంగా గుర్తించిన ఈడీ.. తదుపరి దర్యాప్తులో మూలాలను వెలికితీసేందుకు సిద్ధమవుతోంది.
ఖాతాల వివరాలు, ఆస్తుల సమాచారం పరిశీలన… మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ అధికారులు దీనికి సంబంధించిన సమగ్ర వివరాలివ్వాలని కోరుతూ రెండు రోజుల కిందట సిట్ అధిపతి ఎస్వీ రాజశేఖర్బాబుకు లేఖ రాశారు. సీఐడీ తొలుత నమోదు చేసిన ఎఫ్ఐఆర్ సర్టిఫైడ్ ప్రతులు, ఈ కేసులో నిందితులు, అనుమానితులు, సంబంధమున్న ఇతర వ్యక్తులు, సంస్థల బ్యాంకు ఖాతాల వివరాలు, ఆస్తుల సమాచారం అందివ్వాలని లేఖలో కోరారు. ఇప్పటివరకూ అరెస్టైన నిందితులు, వారి రిమాండు రిపోర్టులు, అభియోగపత్రం దాఖలు చేసుంటే దాని ప్రతి సమర్పించాలని అడిగారు. వాటితో పాటు ఈ కేసు దర్యాప్తులో ఉపయోగపడే, అవసరమైన ఇతర పత్రాలు, సమాచారం ఉంటే అందివ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఈడీ కోరిన వివరాల్ని సిట్ అధికారులు అందించినట్లు తెలిసింది. వాటి ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్కు సంబంధించి లోతుగా వివరాలు ఆరా తీస్తోంది. బ్యాంకు ఖాతాలు, ఆస్తుల సమాచారాన్ని పరిశీలిస్తోంది.
