అదిరే… అదిరే
సర్వం సిద్ధం
- మచిలీపట్నం :
‘ఇది మన ఊరు.. మన పండుగ’ నినాదంతో ఈ నెల 6 నుండి 8వ తేదీ వరకు మచిలీపట్నం మంగినపూడి సముద్ర తీరం వద్ద నిర్వహించనున్న మసులా బీచ్ ఫెస్ట్ – 2025కు సర్వం సిద్ధం చేశారు. పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాథికార సంస్థ, కృష్ణాజిల్లా అధికార యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్ కు సంబంధించి విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. బీచ్ ఫెస్టివల్ లో భాగంగా ఒక రోజు ముందుగా 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు నేషనల్ వాటర్ స్పోర్ట్స్, బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ పోటీలను నిర్వహించనున్నారు. దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద ఈవెంట్గా మసులా బీచ్ ఫెస్టివల్ ఉండనుంది. ఎమ్యూజ్ మెంట్, ఎంటర్ టైన్మెంట్, అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా నిర్వహిస్తున్నారు. హెలీ రైడ్, పారా గ్లైడింగ్, స్పీడ్ బోట్, జెట్ సీ, బంగీ లాంటి క్రీడలను కూడా ఏర్పాటు చేశారు. 5వ తేదీ ఉదయం 9 గంటలకు క్రీడాకారుల ఆధ్వర్యంలో 60 అడుగుల ఎత్తులో అమరావతి అసెంబ్లీ నమూనాతో ఏర్పాటు చేసిన గేట్ వే ఆఫ్ అమరావతిని ఆవిష్కరించనున్నారు. 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణతో వాటర్ స్పోర్ట్స్ ను ప్రారంభించనున్నారు. 6వ తేదీ సాయంత్రం నుండి తెలుగు సినీ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు, తెలుగు వారి రుచులు, ప్రత్యేకంగా బందరు రుచులు, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసే లక్ష్యంతో సుమారు 100కి పైగా ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు.

- అలాగే భారతదేశంలో ప్రత్యేకమైన రుచులతో కూడిన ఆహార పదార్థాలతో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు, ఫెస్టివల్ కు వచ్చే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ నేతృత్వంలో పర్యాటకుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా వన్ వే ట్రాఫిక్ ను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మసులా బీచ్ ఫెస్ట్ కు సంబంధించి ప్రతి కార్యక్రమాన్ని కూడా లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. సముద్ర స్నానాలకు వెళ్లే వారికి మెరైన్ అధికారులు సహకారం అందిస్తున్నారు. మసులా బీచ్ ఫెస్టివల్ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో అంగ రంగ వైభవంగా నిర్వహించనున్నారు.

12వ బీచ్ కబడ్డీ ఛాంపియన్ షిప్
12వ జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్ షిప్ జరుగనుంది. ఈ ఛాంపియన్ షిప్ లో 24 రాష్ట్రాల నుండి పురుషుల, 21 రాష్ట్రాల నుండి మహిళల జట్లు పాల్గొనున్నాయి. సుమారు 600 మంది క్రీడాకారులు, నిర్వహకులు ఈ టోర్నిలో ప్రాతినిధ్యం వహించనున్నారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో టోర్ని జరుగనుంది.
రాష్ట్రంలో తొలిసారిగా సీ కయాకింగ్ స్పోర్ట్స్ :
3వ జాతీయస్థాయి కయాకింగ్ పోటీలను రాష్ట్రంలోనే తొలిసారిగా మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో నిర్వహించనున్నారు. సుమారు 16 రాష్ట్రాల నుండి సుమారు 600 మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారుల, నిర్వాహకులు పోటీల్లో పాల్గొనున్నారు.

ఆహ్వానపు బీచ్ వాలీబాల్ పోటీలు :
మసులా బీచ్ ఫెస్ట్ – 2025లో భాగంగా ఆహ్వానపు బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో 8 పురుషల, 4 మహిళల జట్లు పాల్గొననున్నాయి. లీగ్ కమ్ నాకౌట్ పద్దతిలో పోటీలు జరుగనున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల నుండి పురుషుల జట్లు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి మహిళల జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ లో పాల్గొనే క్రీడాకారులకు, నిర్వహకులకు భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
