అన్ని సమస్యలు సానుకూల ధోరణితోనే పరిష్కారం
కులాలకు, వర్గాలకు అతీతంగా నిర్ణయాలు.
ఉద్యోగుల సమస్యలు, తిరుమలశెట్టి హత్య కేసు పరిష్కారంలో చూసిన రాజకీయ చతురత
ఆశ్చర్యపోతున్న నాటి సహచర్యలు
ఎం.గణేశ్, ఏపీ స్టేట్ బ్యూరో ఇన్ఛార్జి .
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మారిపోయారు. ఆయనలో అంతా సానుకూల ధోరణి కనపడుతోంది. ఒకప్పటి చంద్రబాబు కాదని అప్పటి సహచరులు అంటున్నారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతున్నారు. చిన్నా పెద్దా, పేదా, ధనిక అనే తేడా లేదు. ఎన్నో అనుభవాలు, కాలం నేర్పిన పాఠాలను పరిగణనలోకి తీసుకుని కొన్ని సమస్యలు ముదురకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బేషజాలకు పోవడం లేదు. అవసరమైతే ఒక్క అడుగు వెనక్కి వేస్తున్నారు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతున్నారు.

పది రోజుల వ్యవధిలో మూడు సమస్యలు పరిష్కారంలో ఆయన చూపిన చొరవ, ఆసక్తి రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, బీసెంట్ రోడ్డులోని హాకర్లతో చచ్చలు, కందుకూరులో ఇటీవల హత్యకు గురైన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కేసు విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు పట్ల హర్షం వ్యక్తం అవుతుంది. రెండు కులాల మధ్య విబేధాలు పెరగకుండా ఆయన ముందస్తుగా తీసుకున్న నిర్ణయం ఇతర పార్టీలకు మింగుడు పడటం లేదు. విశాఖ గూగుల్ సంస్ధపై ఇతర రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు, ఏపీలోని వైసీపీ నేతల విమర్శలకు ఏ మాత్రం స్పందించక పోవడం కూడా ఆయన మారిన వైఖరిని స్పష్టం చేస్తుంది. భుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే హడల్. ఒకప్పుడు ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సమయంలోనూ, వివిధ పథకాలకు సమీక్ష్లలు చేసిన సమయంలో ఉద్యోగులు, అధికారులు తప్పు చేశారనే ఫిర్యాదులు వచ్చినా, ఆరోపణలు వచ్చినా కఠిన చర్యలు తీసుకునే వారు. ఆయన పర్యటన అంటే అధికారులు హడలిపోయే వారు. ఒకరిద్దరు అధికారులు వత్తిడి తట్టుకోలేక చనిపోయిన సంఘటనలు కూడా లేకపోలేదు.2014లో మూడోసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో అంతకు ముందు వలూ కఠినంగా వ్యవహరించకపోయినా, ఉద్యోగుల పనితీరు విషయంలో సీరియస్ గానే వ్యవహరించేవారని చెబుతున్నారు. నాలుగో సారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబులో చాలా మార్పు వచ్చిందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా గత ఐదేళ్ల పాలనలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ తో పోల్చిచూస్తున్న ఉద్యోగులు.. చంద్రబాబులో మరో కోణాన్ని చూస్తున్నామని వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమ సమస్యలు పరిష్కరిస్తారని 16 నెలలుగా ఉద్యోగులు ఎదురుచూస్తూ వస్తున్నారు. కానీ, ఆయన ముందుకు వెళ్లి తమ గోడు చెప్పడానికి వెనుకంజ వేశారు. పత్రికల ద్వారా తమ బాధలు చెప్పుకోవడమే కానీ, నేరుగా ముఖ్యమంత్రిని ఇంతవరకు కలవలేదు. కానీ, ఎవరూ ఊహించని విధంగా శనివారం ఆకస్మాత్తుగా ప్రభుత్వం నుంచి వర్తమానం రావడం, 14 సంఘాల వారిని పిలిచి చర్చించడం ముఖ్యమంత్రి చంద్రబాబులో వచ్చిన మార్పునకు నిదర్శనమంటున్నారు.
సుమారు రెండు గంటల పాటు సమయం కేటాయించి, ఉద్యోగ సంఘాల నేతలు చెప్పినవన్నీ సావదానంగా విన్న చంద్రబాబు.. ప్రభుత్వ ఇబ్బందులను వారికి తెలియజేసి నచ్చజెప్పే ప్రయత్నం చేయడం ఉద్యోగులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా తమ స్నేహితుడి మాదిరిగా చర్చించడం చూసి.. తాము గతంలో చూసిన చంద్రబాబు ఇతనేనా? అన్న ఆశ్చర్యపోయారని అంటున్నారు.వాళ్ల డిమాండ్లను ఓపికగా, సానుకూలంతో విని అప్పటికప్పుడు నిర్ణయాలు ఆయన ప్రకటించడం ఉద్యోగ వర్గాలు చేస్తున్నారు. దీపావళి ముందు రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ బీసెంట్ రోడ్లో పర్యటించారు. పలువురు చిరు, వీధి వ్యాపారులు, జనరల్ స్టోర్, చెప్పుల షాపు నిర్వాహకులతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా వస్తువుల ధరల తగ్గుదలను గురించి ఆయా వర్గాల వారిని అడిగి తెలుసుకున్నారు. కనీసం ఆ నియోజకవర్గ శాసన సభ్యులు కూడా అదికారంలోకి వచ్చిన తరువాత బీసెంట్ రోడ్ లో పర్యటించలేదు. వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అయితే హాకర్లు, సేల్స్ గర్ల్, చెప్పుల షాపు యజయానులతో కూడా చర్చించారు. చిన్నా, పెద్దా, పేద, ధనిక అనే వ్యత్యాసం లేకుండా ఆయన వ్యవహరించిన తీరు స్పష్టమైంది.

