ప్రతి నీటి బొట్టునూ సంరక్షించుకుని భవిష్యత్తును కాపాడుకుందామని ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పిలుపునిచ్చారు. నీటి ప్రాముఖ్యతను గుర్తించి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. నీటి ప్రాధాన్యాన్ని తెలియజెబుతూ జలజీవన్ మిషన్, ఉపాధి హామీ పథకాల కింద రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న జల సంరక్షణ కార్యక్రమాలు, తాగునీటి ప్రాజెక్టుల పనులను వివరించారు. ‘గత 20 నెలల్లో ఒక టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం గల 1,06,788 వ్యవసాయ కుంటలు, 13,500 పశువుల తొట్టెలను నిర్మించాం. 1.46 కోట్ల జనాభాకు లబ్ధి చేకూరేలా రూ.9,441 కోట్లతో 8 మల్టీ విలేజ్ నీటి పథకాల పనులు చేపట్టాం. రూ.9,355 కోట్లతో త్వరలో మరో ఏడు మల్టీ విలేజ్ పథకాల పనులు ప్రారంభం కానున్నాయి. తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న మరో 3 వేల గ్రామాల్లో 38.54 లక్షల జనాభాకు లబ్ధి చేకూరేలా రూ.1,814.71 కోట్లతో పనులు చేపట్టనున్నాం’ అని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు.
