మొదటి దశకు రూ.11,009
ట్రామ్ తరహా రవాణా
విజయవాడ – గన్నవరం
విజయవాడ – పెనమలూరు
డీపీఆర్ సిద్దం
ఏపీ స్టేట్ బ్యూరో,
రాజధాని అమరావతిలో భాగంగా ఏర్పాటు చేయనున్న లైట్ మెట్రోకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. రెండు దశల్లో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టుకు మొదటి దశకు రూ.11,009 కోట్లు, భూ సేకరణకు రూ.1,152 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. దీనికి సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారీ బాధ్యతను శిస్ట్రా కన్సల్టెన్సీకి అప్పగించింది. కంపెనీ ప్రాథమిక నివేదికను మెట్రో రైల్ కార్పొరేషన్కు అప్పగించినట్లు తెలిసింది. విభజన హామీల్లో భాగంగా కేంద్రం అమరావతికి రైల్ కనెక్టివిటీ అవకాశం కల్పించింది. దీనిలో భాగంగా ఎర్రుపాలెం-నంబూరు మధ్య రైల్వేలైన్కు అనుమతులూ వచ్చాయి. అదే సమయంలో విజయవాడ నుండి రాజధాని అమరావతికి లైట్ మెట్రోను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడలో లైట్ మెట్రో (ట్రామ్ తరహా రవాణా)ను రెండు దశల్లో ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో రెండు భాగాలుగా నిర్మించనున్నారు. మొదటి భాగం (1ఎ)లో విజయవాడ నుండి గన్నవరం, రెండో భాగం(1బి)లో విజయవాడ నుండి పెనమలూరు వరకూ 38.40 కిలోమీటర్లు నిర్మించనున్నారు. రెండో దశలో విజయవాడ నుండి అమరావతిలోని నీరుకొండ రిజర్వాయర్ వరకూ 27.75 కిలోమీటర్లు ఎల్ఆర్టి (లైట్ మెట్రో ట్రాన్సిట్) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి మొదటి దశకు మాత్రమే డిపిఆర్ సిద్ధం చేశారు. ఈ మేరకు రుణ సమీకరణకూ మెట్రో చర్చలు జరుపుతోంది. విజయవాడ నుండి గన్నవరం వరకూ ఏర్పాటు చేయనున్న రైల్వేలైన్లో 23 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్, 2.9 కిలోమీటర్లు అండర్గ్రౌండ్ కారిడార్ మొత్తం 25.9 కిలోమీటర్లు, రెండోదశలో పెనులూరు లైన్లో 12.5 కిలోమీటర్లు పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్గా నిర్మించనున్నారు. మొత్తం రెండు రూట్లలో 33 స్టేషన్లు ఉండనున్నాయి. గన్నవరం రూట్లో ఒకచోట అండర్గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదన ఉంది. వీలైనంత త్వరలో పనులు ప్రారంభం అవుతాయని, కేంద్రం నుండి అనుమతులు వస్తాయని మెట్రో కార్పొరేషన్ అధికారులు తెలిపారు.

విశాఖలో రూ.14,309 కోట్లు
విశాఖపట్నంలోనూ నాలుగు కారిడార్లలో మెట్రో ఏర్పాటు చేయనున్నారు. దీనిలో ప్రభుత్వ వాటా 40 శాతం, ప్రైవేటు డెవలపర్ వాటా 60 శాతం ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం 76.90 కిలోమీటర్ల ప్రాజెక్టుకు రూ.14,309 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. దీనిలోనూ మొదటి మూడు కారిడార్లు 46.23 కిలోమీటర్లు నిర్మించనున్నారు. దీనికి రూ.11,498 కోట్లు అంచనాలేసి ప్రభుత్వానికి పంపగా ఆమోదం లభించింది. దీనిపై ఉత్తర్వులూ విడుదల చేశారు. దీనిలో మొదటి కారిడార్లో స్టీల్ ప్లాంటు నుండి కొమ్మాది వరకూ 34.40 కిలోమీటర్లు, గురుద్వారా నుండి ఓల్డ్ పోస్టాఫీసు వరకూ 5.08 కిలోమీటర్లు, తాటిచెట్లపాలెం నుండి చిన్నవాల్తేర్ వరకూ 6.75 కిలోమీటర్లు నిర్మించనున్నారు. సవరించిన అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో రుణాల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. ఎఐఐబి ముందుకు రావడంతో త్వరలోనే ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి. రెండోదశలో నాలుగో కారిడార్ కొమ్మాది నుండి భోగాపురం వరకూ 30.67 కిలోమీటర్లు నిర్మించనున్నారు. ప్రస్తుతం మొదటి మూడు కారిడార్లను పట్టాలెక్కించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో సేకరించాల్సిన భూమి విలువ అదనంగా ఉంది.
21 వరకూ బిడ్ల గడువు పొడిగింపు
విశాఖపట్నం, విజయవాడలో డబుల్ డెక్కర్ తరహాలో నిర్మించనున్న నాలుగు లైన్ల ఫ్లైఓవర్ మెట్రో లైను ఏర్పాట్లకు సంబంధించి డిపిఆర్ తయారీకి అవసరమైన కన్సల్టెంట్ల నియామక బిడ్ల సమర్పణ గడువు బుధవారంతో ముగిసింది. దీంతో ఈ నెల 21వ తేదీ వరకూ అర్హత ఉన్న కన్సల్టెంట్లు బిడ్లను సమర్పించవచ్చని గడువును పొడిగించారు.
—–
