ఏపీ స్టేట్ బ్యూరో,
ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకే ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరకుల పంపిణీ చేపడుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో 1.46 కోట్ల కుటుంబాలకు 29,761 రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీకి చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. లబ్ధిదారులు రైస్ కార్డు నమోదైన డీలర్ దగ్గరే కాకుండా… తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించామని చెప్పారు. ఆదివారం ఉదయం పిఠాపురం పట్టణంలో గాంధీ బొమ్మ సెంటర్ నూకాలమ్మ గుడి వీధిలో చౌకధరల దుకాణం వద్ద రేషన్ సరకుల పంపిణీని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
-ప్రతి నెలా 1 నుంచి 15 తేదీలోపు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయి. ఆదివారాల్లోనూ సరుకులు పంపిణీ చేస్తాం. దివ్యాంగులకు, 65 ఏళ్లు నిండిన వృద్ధులకి ప్రతి నెలా 5వ తేదీలోపు సరుకులు ఇళ్ల వద్దే అందిచేలా చర్యలు తీసుకున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 15.6 లక్షల మంది ఉన్నట్లు గుర్తించాం. వారికి రేషన్ అందించే బాధ్యత రేషన్ దుకాణదారులదే. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. రేషన డెలివరీ అయిన వెంటనే అందులో ఫోటో అప్ లోడ్ చేసేలా డీలర్లకు ఆదేశాలు జారీ చేశాం.
.పోర్టుల్లో భద్రత కట్టుదిట్టం చేస్తాం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ మాఫియాకు చెక్ పెట్టాం. ఎక్కడికక్కడ మాఫియా కోరలు పీకేశాం. కాకినాడ, విశాఖ పోర్టుల నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి కాకుండా పటిష్టభద్రత ఏర్పాటు చేశాం. రైస్ స్మగ్లింగ్ చేసిన వారిపై పీడీ యాక్ట్ తీసుకొచ్చాం. కాకినాడ పోర్టు దగ్గర ఏర్పాటు చేసినట్లే… నెల్లూరు జిల్లా తడ వద్ద, కృష్టపట్నం పోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశాం. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం ఎక్కడా పక్కదారిపట్టకుండా చర్యలు తీసుకుంటున్నాం” అన్నారు
.
