“ప్రకృతి వ్యవసాయ మామిడి”
ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ తో లక్షల్లో ఆదాయం
ముందుగానే ఆర్డర్లు- ఓ మహిళా రైతు హేమ విజయ గాధ
ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎమ్ డీ ఎస్) రైతులకు ఓ వరం లా మారుతోంది. నేలలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన పంటకు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సామర్థ్యాన్ని ఇస్తూనే రైతును నస్టాలనుంచి కాపాడుతుంది. తక్కువ పెట్టుబడి,అధిక దిగుబడి.. అధిక ఆదాయం చేకూరుస్తుంది. ప్రధాన పంటతో పాటు అంతర పంటలు అధనపు లాభం చేకుర్చుతున్నాయి. ఈ కోవకు చెందిన మహిళా రైతు హేమ విజయ గాధ ఇది . పూర్తిగా నష్టాల్లో ఉన్న మామిడి తోటను మార్చుకోవాలని నిర్ణయించు కున్న సమయంలో ప్రకృతి వ్యవసాయం హేమకు వెలుగు దారిని చూపింది. ఈ ఏడాది మామిడి పంట ద్వారా 4 ఎకరాల్లో ఏకంగా 10 లక్షల రూపాయల ఆదాయం సంపాదించారు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ తో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంభించారు. ఆరు సంవత్సరాలుగా పీ ఏం డీ ఎస్ విధానం అనుసరిస్తూ నేలను సారవంతం చేసుకోవడం తో పాటు అదనపు ఆదాయం పొందుతూ తోటి రైతులను అబ్బురపరుస్తున్నారు. నేల సారూప్యంలో అన్ని విధాలుగా మార్పులు రావడం.. ప్రతి సంవత్సరం దిగుబడి, ఆదాయం పెరగడం, నష్టాల్లో ఉన్న మామిడి తోట ఈ ఏడాది ఏకంగా రూ.10 లక్షల ఆదాయం రావడం తో రైతు అందానికి అవదుల్లేవు. నష్టాల నుంచి లాభాల వైపు నడిపిస్తూ తోటి రైతులకి ఆదర్శంగా నిలుస్తున్నారు.

కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనీగూడెం గ్రామానికి చెందిన మహిళా రైతు ఏ. హేమ 10 వ తరగతి వరకు చదువుకున్నారు. భర్త శ్రీనివాసరెడ్డి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరికి ఒక ఎకరం మాత్రమే భూమి ఉంది. దీంతో పాటు సమీపంలో ఎకరానికి రూ. 10 వేల చొప్పున చెల్లించి 3 ఎకరాలను కౌలు తీసుకున్నారు. సాగునీటి బోరు ఉంది. ప్రస్తుతం హేమ రైతు సాధికార సంస్థలో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ గా పని చేస్తున్నారు. వ్యవసాయం పైన ఆధారపడిన కుటుంబం . ప్రధాన పంట మామిడి. మొత్తం 92 చెట్లు ఉన్నాయి. ఇందులో బంగినిపల్లి, చిన్నరసాలు, పెద్ద రసాలు, ముంతమామిడి, కొత్తపల్లి కొబ్బరి, చెరుకురసం వంటి పలు రకాల చెట్లు ఉన్నాయి. మామిడి చెట్లలో 30 సంవత్సరాల వయస్సు కలిగినవి కూడ ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయం లోకి అడుగిడక ముందు ఒకే పంట తోనే వ్యవసాయాన్ని కొనసాగించారు. రసాయన వ్యవసాయం కావడం తో వేసవి కాలం లో మొక్కల్ని కాపాడుకునేందుకు అప్పట్లో చాలా ఇబ్బందులు పడ్డారు. కొన్ని సమయాల్లో చెట్ల కొమ్మలు ఎండిపోయేవి. కొమ్మలను కాపాడుకోడానికి 14 సార్లకు పైగా నీటి తడులను ఇవ్వవాల్సి వచ్చేది. ఏడాదిలో కనీసం 7 సార్లు చెట్ల మధ్య కలుపును తొలగించడం అదనపు భారంగా మారింది. ఎరువులు, పురుగు మందులు నివారించడం కూడా పెద్ద సవాలుగా తయారైంది. దీంతో పాటు ఎరువుల కోసం అధిక ఖర్చులు వచ్చేవి. కనీసం రూ . 2.60 లక్షలు పెట్టుబడి భరించాల్సి వచ్చేది.
ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ తో మొదలైన మార్పు: పెట్టుబడి ఖర్చులతో సతమతం అవుతున్న మహిళా రైతుకి రైతు సాధికార సంస్థ ద్వారా (ఆర్ వై ఎస్ ఎస్ )రాష్ట్రం లో అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఉదయించే సూర్య కిరణం లా కనిపించింది. పొదుపు సంఘాల్లో మహిళలకు ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయం పట్ల కలిగిన అవగాహన వల్ల నష్టాల్లో ఉన్న మామిడి తోటను కాపాడుకోడానికి హేమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగా ఆర్ వై ఎస్ ఎస్ ప్రవేశపెట్టిన ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పద్ధతిని తొలి ప్రయత్నంగా 2020 వ సంవత్సరం లో మొదలుపెట్టి ఎకరానికి 12 కిలోల చొప్పున నవధాన్యాలను వెదజల్లారు. 2021 సంవత్సరం లో 12 కిలోలు ఏడాదిలో రెండు సార్లు చొప్పున వెదజల్లారు. ఆ తర్వాత ప్రతి ఏడాది పీఎండీఎస్ విధానం అనుసరిస్తున్నారు . వీటితో పాటు ఘన, ద్రవ జీవామృతాలను వినియోగించారు. అవసరమైన సంధర్భం లలో కషాయాలను ఉపయోగిస్తారు. మామిడి తోటలో చెట్టు నుంచి రాలిపడిన పండ్లను కలియబెట్టి బెల్లానికి బదులుగా కుళ్లిన మామిడి రసాన్ని ద్రావణం లో వినియోగిస్తారు. అగ్నా స్త్రం , పంచగవవ్య, పేడ ఇంగువ ద్రావణం వాడుతున్నారు.

ఏటేటా పెరుగుతున్న ఆదాయం: మామిడి తోటలో అంతర పంటలుగా నవధాన్యాలను సాగు చేయడం ద్వారా నిరంతర ఆదాయం రావడం మొదలైంది. పీఎండీఎస్ ను ఖరీఫ్ పంటకు ముందు మే నెల నుంచి జూన్, ఒక నెల ఖాళీగా ఉంచి మరలా వె దజల్లుతారు. రబీ ముందు తో నవధాన్యాలను సాగుచేస్తారు. రెండు దేశీయ ఆవులకు పచ్చి మేత లభిస్తోంది. అలాగే ఇంటికి కావలసిన కూరగాయలు, ఆకుకూరలు తీసుకుంటున్నారు. మిగిలిన సరుకును మార్కెట్లో విక్రయిస్తున్నారు. కూరగాయల సాగుతో ప్రతి నెల రూ. 10 వేలవరకు లభిస్తోంది. మామిడి తోటలో నవధాన్యాల సాగు చేపట్టడం ద్వారా నేల సారవంతమై ప్రతి ఏటా మామిడి పంటలో వచ్చే ఆదాయం పెరుగుతోంది. 2020 సంవత్సరం లో రూ. 1.20 లక్షల ఆదాయం రాగా 2021 లో రూ. 3 లక్షలు, 2022 లో రూ. 4 లక్షలు, 2023 లో రూ. 5 లక్షలు, 2024 లో రూ. 5.60 లక్షలు వచ్చింది. ఈ ఏడాది అంటే 2025 సంవత్సరంలో ఏకంగా రూ. 10 లక్ష ఆదాయం వచ్చిందని మహిళా రైతు ఆనందాన్ని వ్యక్తం చేసింది. నవధాన్యాల తో పాటు బంతి పూల తోట ను కూడా సాగు చేస్తున్నారు. ఇలా ప్రతి పంట ద్వారా ఆదాయ సమకూరుతుందని పేర్కొంటున్నారు.
మామిడి పళ్లకోసం అడ్వాన్స్ బుకింగ్: పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడం తో హేమ పండించిన పండ్లకు బాగా డిమాండ్ ఉంటుంది. రైతు తన పొలం లో పండించిన పండ్లు, కూరగాయలు, ఆకుకూరల మార్కెటింగ్ కోసం మహిళా పొదుపు సంఘం, రైతు సాధికార సంస్థ ఉద్యోగుల వారీగా ప్రత్యేక వాట్సప్ గ్రూప్ లను ఏర్పాటు చేసింది. ఆయా గ్రూప్ లలో పండించిన పంట దిగుబడులను ఛాయా చిత్రాలతో పాటు ధరల సమాచారాన్ని పంచుకుంటూ ముందుగానే ఆర్డర్ లు అందుకొంటోంది. ప్రాథమిక హెల్త్ సెంటర్ దగ్గర విక్రయించే ప్రకృతి వ్యవసాయ పంట ఉత్పత్తులను కొనడానికి ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. తోట వద్దనే పండ్లు కొనుగోలు చేసే వినియోగదారుల సంఖ్య కూడా పెరిగింది.
పీఎండీఎస్ తో మంచి ఫలితాలు : మహిళా రైతు హేమ
మా పొలం కొండలణు అంచున ఉంటుంది. ఎర్ర రకం నేల కానీ రాళ్ళతో కూడి ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం చేయక ముందు ఎక్కువగా పంటకు నీటి తడులు ఇచ్చేవాళ్ళం. ప్రస్తుతం వేసవిలోనూ తోటను కాపాడుకోగలుగుతున్నాము. ఇతర ప్రాంతాల వారు కూడా ఉత్పత్తులను అడుగుతున్నారు. పీఎండీఎస్ ద్వారా మరింత లాభాలు అందుకున్నాము. పీఎండీఎస్ అనుసరించడం ద్వారా అదనంగా వచ్చే పశువుల మేతను విక్రయిస్తున్నాను.
