వైసిపి బాస్ ని టార్గెట్ గా సిట్ విచారణ
ఆ దిశగా విజయసాయి , మిధున్ రెడ్డిలపై విచారణ
కసిరెడ్డి కోసం జల్లెడ
వైసిపి చుట్టూ బిగుస్తున్న లిక్కర్ స్కాం ఉచ్చు
ఏపీ ఎనాలిసిస్, విజయవాడ
లిక్కర్ స్కామ్ లో వైసీపీ బాసును టార్గెట్ చేసే విధంగా సిట్ దర్యాప్తు వేగవంతం అవుతుందా? అంటే అవుననే సమాధానమే ఎక్కువుగా వినపడుతోంది. కుంభకోణంపై వేగంగా జరుగుతున్నవిచారణ వైసీపీలో ప్రకంపనలు రేపుతుంది. జగన్ కు కుడి భుజంగా ఇటీవలి వరకు కొనసాగిన విజయసాయిరెడ్డి ఈ విచారణలో ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకపోయినప్పటికీ, ఆరోపణలు ఎదుర్కోంటున్న కసిరెడ్డిపై నిప్పులు చెరుగుతున్నారు. అతనో క్రిమినల్ అని, ఇందులో అతని పాత్రే ఎక్కువుగా ఉందని బహిరంగంగా ప్రకటించారు. మరోవైపు కసిరెడ్డి ఇప్పటి వరకు సిట్ విచారణకు హాజరుకాకుండానే విజయసాయి రెడ్డిపై తీవ్ర స్ధాయిలో ఆరోపణలు, విమర్శలు చేశారు. అనేక అంశాలతో కూడిన ఒక వీడియోను కూడా విడుదల చేశారు. సిట్ విచారణ ఇంకా ఒక దశకు చేరకుండానే ఈ ఇద్దరు వ్యక్తులు బాహాటంగా ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. కసిరెడ్డి కూడా విచారణ కు హాజరైతే కుంభకోణంలోని అంశాలన్నీ త్వరగానే బయటపడే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయం అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు వైసీపీ వర్గాల్లోనూ వినపడుతోంది. ఆదే జరిగితే వైసీపీ బాస్ కు, పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని పార్ఠీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం అమ్మటమే కాకుండా ఇష్టానుసారంగా ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో నేటి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గత ప్రభుత్వం మద్యం వ్యాపారం చేయడంతో పాటు మద్యం కొనుగోలు చేసే వారి నోరు మూయించింది. మేము అమ్మేది ఇలాగే.. ఇష్టమైతే కొనుక్కో.. లేకుంటే వెళ్లిపో.. అంటూ ఎక్సైజ్ పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడింది. మద్యం ప్రియులు గత ప్రభుత్వంలో ఐదేళ్లూ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతూనే కొనుగోలు చేశారు. పైగా రాత్రి సమయాల్లో షాపుల వద్ద కనీసం లైట్లు కూడా ఉండేవి కాదు. ఎందుకంటే మద్యం బ్రాండ్స్ కనిపించకుండా ఉండటం కోసం ఈ విధంగా చేసే వారనే ఆరోపణలు ఉన్నాయి. షాపులో ఉండే అమ్మకందారులు కూడా కొనుగోలు దారులకు మర్యాద ఇచ్చే వారు కాదు. మద్యానికి అలవాటు పడిన వారు నిత్యం ప్రభుత్వాన్ని తిట్టుకుంటూనే కొనుగోలు చేశారు.

దశల వారీగా మధ్య నిషేదం చేస్తానని ప్రకటించిన జగన్ మద్యం అమ్మకాల్లో తమ ప్రభుత్వ పెద్దలు దోపిడీ చేస్తుంటే చూస్తూ ఉన్నారంటే ఆయన కూడా ఇందులో భాగస్వామేననే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో విజయసాయి రెడ్డి తరువాత మాజీ ఎంపీ మిధున్ రెడ్డిపై సిట్ విచారణ ప్రారంభం అయింది. వీరితోపాటు లిక్కర్ కుంభకోణంలో కీలక పాత్ర వహించారనే ఆరోపణలు వినపడుతున్న రాజ్ కసిరెడ్డిని విచారించేందుకు సిట్ ఇప్పటికే నాలుగుసార్లు నోటీసులు ఇచ్చింది. అయితే కసిరెడ్డి విచారణకు హాజరుకాకుండా న్యాయపరంగా ముందస్తు బెయిల్ పొందడానికిపోరాటం చేస్తున్నారు.
అయితే రాజ్ కసిరెడ్డి డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈడీ క్రియేషన్స్ వంటి కంపెనీలను కసిరెడ్డి ఏర్పాటుచేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కంపెనీల ద్వారా నాసిరకం ‘J’ బ్రాండ్లను ప్రభుత్వ మద్యం షాపులకు సరఫరా చేసి, అక్రమ లాభాలు ఆర్జించినట్లు సిట్ విచారణలో తేలింది. అక్రమంగా సంపాదించిన డబ్బును సినిమా నిర్మాణం, రియల్ ఎస్టేట్, ఆసుపత్రులు, ఇన్ఫ్రా ప్రాజెక్టులలో పెట్టుబడులుగా మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. హైకోర్టు అతని ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన తర్వాత అతను దేశం విడిచి అమెరికాకు పారిపోయినట్లు సమాచారం. పోలీసుల వద్ద ఆ సమాచారం ఉంది. హైదరాబాద్లోని అతని నివాసాలు, కార్యాలయాలు, బినామీ సంస్థలపై సిట్ దాడులు నిర్వహించి, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. దీనితో అతనిపై దృష్టిని మరింత పెంచింది.
- విజయసాయి రెడ్డిపైనే అందరికీ అనుమానం

