శాంతి భధ్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
ఏపీ ఎనాలిసిస్, విజయవాడ
వైసీపీ నాయకులు బల ప్రయోగం, పరామర్శలు, ర్యాలీల పేరుతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారధి హెచ్చరించారు. సాక్షి ఛానల్ లో మహిళా సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు నిరసన తెలియజేయడానికి వచ్చిన మహిళలు, పోలీసులపై వైసీపీ కార్యకర్తలు, నాయకులు చెప్పులు, రాళ్లు విసిరారని ఆయన చెప్పారు. ఇదంతా ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. కేవలం నేర ప్రవృత్తిని ప్రదర్శించడానికి వైసీపీ పొదిలిలో ర్యాలీ చేసిందని ఆయన ఆరోపించారు. వైసీపీకి రైతలు, ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి లేదు. రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీకి జగన్ రారు. ప్రజల సమస్యలు ప్రస్తావించరు. రైతులు, ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని ఆయన కోరారు.
కూటమి ప్రభుత్వం ఈ యేడాది కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా తల్లికి వందనం డబ్బులిచ్చింది. వైసీపీ నాయకులు గమ్యం లేని సంక్షేమ కార్యక్రమాలు చేశారు. మేము గమ్యం, లక్ష్యం, ఒక భవిష్యత్తుకు పునాది వేసే కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయడానికి జగన్ ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో హైదరాబాద్ లో అల్లర్లకు తావులేకుండా చేశారు. అల్లర్లను రూపుమాపారు. హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేశారు. సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్న వైసీపి పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి పార్థసారధి హెచ్చరించారు.
