ఐపీఎల్ చరిత్రలో చెన్నైని వారి సొంతగడ్డపై ఓడించి ఎరుగదు సన్రైజర్స్ హైదరాబాద్.. పైగా ఈ సీజన్లో ఆ జట్టు ఆట పేలవం. పెద్దగా అంచనాలు లేవు. కానీ సన్రైజర్స్ అదరగొట్టింది. మొదట బంతితో విజృంభించి.. తర్వాత బ్యాట్తోనూ మెరిసి చెపాక్ కోట బద్దలు కొట్టింది. మిణుకుమిణుకుమంటున్న ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ సీజన్లో వరుస పరాభవాలను చవిచూస్తున్న సీఎస్కే (Chennai Super Kings) ఇంకో ఓటమితో దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. 9 మ్యాచ్ల్లో ఆ జట్టుకిది ఏడో పరాజయం.
సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మెరిసింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో చెన్నైని 5 వికెట్ల తేడాతో ఓడించి చెపాక్లో తొలి విజయాన్ని అందుకుంది. మొదట చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. బ్రెవిస్ (42; 25 బంతుల్లో 1×4, 4×6), ఆయుష్ మాత్రే (30; 19 బంతుల్లో 6×4) పోరాడటంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్షల్ పటేల్ (4/28) సీఎస్కేకి కళ్లెం వేశాడు. ఇషాన్ కిషన్ (44; 34 బంతుల్లో 5×4, 1×6), కమిందు మెండిస్ (32 నాటౌట్; 22 బంతుల్లో 3×4) రాణించడంతో సన్రైజర్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
సాధించాల్సిన లక్ష్యం తక్కువే అయినా.. ఒత్తిడి లేకపోయినా ఆరంభంలో చెన్నై మాదిరే తడబడింది సన్రైజర్స్. వైఫల్యాలను కొనసాగిస్తూ అభిషేక్శర్మ (0) ఇన్నింగ్స్ రెండో బంతికే ఔటయ్యాడు. ఈ వికెట్ ఖలీల్ తీశాడు. చెపాక్ పిచ్పై షాట్లు ఆడడం అంత తేలిక కాకపోవడంతో ట్రావిస్ హెడ్ (19), ఇషాన్ కిషన్ (Ishan Kishan) నెమ్మదిగా స్కోరు పెంచారు. 5 ఓవర్లకు 36/1తో కోలుకుంటున్నట్లు కనిపించిన సన్రైజర్స్కు ఎదురుదెబ్బ తగిలింది. హెడ్ను కాంబోజ్ బౌల్డ్ చేసి సీఎస్కేకి బ్రేక్ ఇచ్చాడు. నూర్ అహ్మద్, జడేజా కట్టుదిట్టంగా బంతులేయడంతో సన్రైజర్స్ బ్యాటర్లు తేలిగ్గా పరుగులు చేయలేకపోయారు. పైగా క్లాసెన్ (7) వెనుదిరగడం ఆ జట్టును ఇబ్బందుల్లో నెట్టింది. 66 బంతుల్లో 100 పరుగులు చేయాల్సిన స్థితిలో పదో ఓవర్లో ఇషాన్ ఫోర్, అనికేత్ సిక్స్ బాదడంతో కాస్త స్కోరు కదిలింది. నూర్ బౌలింగ్లో సిక్స్ బాదిన ఇషాన్.. మరో షాట్కు ప్రయత్నించి ఔటైపోయాడు. ఈ వికెట్ పడినా సమీకరణం (48 బంతుల్లో 65 పరుగులు) మరీ క్లిష్టంగా లేకపోవడంతో సన్రైజర్స్ ఒత్తిడికి గురి కాలేదు. అనికేత్వర్మ (19) కూడా ఔటైనా.. కమిందు మెండిస్, నితీశ్కుమార్ (19 నాటౌట్; 13 బంతుల్లో 2×4) చెన్నైకి అవకాశం ఇవ్వలేదు. సమయోచితంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.
చెన్నై అదే తడబాటు: బ్యాటింగ్లో తడబాటు.. ఐపీఎల్-18లో (IPL) ఎక్కువ మ్యాచ్ల్లో చెన్నైని ఇబ్బందిపెట్టింది ఇదే. సన్రైజర్స్తో మ్యాచ్లోనూ సీఎస్కే ఇదే ఆట ఆడింది. ఇన్నింగ్స్లో వేగం లేదు. షాట్లలో పదును లేదు. ఎక్కువ భాగస్వామ్యాలు నెలకొల్పలేదు. షాట్ సెలక్షన్ అసలే బాగాలేదు. అందుకే ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. స్లో బంతులు, కటర్స్తో రాణించిన పేసర్ హర్షల్.. చెన్నై కట్టడిలో కీలకపాత్ర పోషించాడు. చెన్నై ఇన్నింగ్స్ ఆరంభమే పేలవం. తొలి బంతికే షేక్ రషీద్ (0) ఔటైపోయాడు. ముంబయితో గత మ్యాచ్లో మెరుగ్గా ఆడిన ఆయూష్ మాత్రే ధాటిగా ఆడి స్కోరుబోర్డు కదిలించాడు. 4.2 ఓవర్లకు 39/1తో మెరుగ్గానే కనిపించిన సీఎస్కే.. స్వల్ప వ్యవధిలో సామ్ కరన్ (9), ఆయుష్ వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా (21; 17 బంతుల్లో 1×4, 1×6) కాసేపు క్రీజులో నిలిచినా.. వేగంగా ఆడలేకపోయాడు. 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హర్షల్ క్యాచ్ వదిలేయడంతో జీవనదానం పొందిన అతడు.. ఆ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడు. కమిందు బౌలింగ్లో క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. ఈ స్థితిలో బ్రెవిస్, శివమ్ దూబెతో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ముఖ్యంగా బ్రెవిస్ మెరుపు షాట్లతో సీఎస్కే ఇన్నింగ్స్కు జీవం తెచ్చాడు. కమిందు వేసిన 12వ ఓవర్లో చెలరేగిన అతడు 3 సిక్స్లు బాదడంతో 20 పరుగులు వచ్చాయి. బ్రెవిస్, దూబె ఓవర్ తేడాతో ఔట్ కావడంతో చెన్నైకి ఎదురుదెబ్బ తగిలింది. 400వ టీ20 ఆడుతున్న ధోని (6) కూడా నిరాశపరిచాడు. చివర్లో దీపక్ హుడా (22) నిలిచి స్కోరు 150 దాటించాడు. కమిన్స్ (2/21), జైదేవ్ ఉనద్కత్ (2/21), కమిందు మెండిస్ (1/26) కూడా చెన్నై బ్యాటర్లను కట్టడి చేశారు.
సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాళ్లు అధిగమించిన మహేంద్రసింగ్ ధోని (MS Dhoni) మరో ఘనత సాధించాడు. శుక్రవారం ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ ధోనికి 400వ టీ20. పొట్టి ఫార్మాట్లో నాలుగొందల మ్యాచ్లు ఆడిన నాలుగో భారత క్రికెటర్ అతడు. రోహిత్శర్మ (456), దినేశ్ కార్తీక్ (412), విరాట్ కోహ్లి (408) ఈ జాబితాలో ధోని కన్నా ముందున్నారు. అత్యధిక టీ20లు ఆడిన ప్లేయర్లలో వెస్టిండీస్ స్టార్ పొలార్డ్ (695) అగ్రస్థానంలో ఉన్నాడు. డ్వేన్ బ్రావో (582), షోయబ్ మాలిక్ (పాకిస్థాన్, 557) రెండు, మూడో స్థానాల్లో కొనసాగుతున్నారు.
