జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో తీవ్రవాదుల హత్యాకాండ నేపథ్యంలో భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో.. దేశీయ మదుపర్లూ జాగ్రత్తపడ్డారు. విదేశీ, దేశీయ సంస్థాగత మదుపర్లు కొనుగోళ్లు చేపట్టినా, సాధారణ మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలకు వరుసగా రెండో రోజూ నష్టాలు తప్పలేదు. జనవరి- మార్చి త్రైమాసిక ఫలితాల ప్రభావంతో యాక్సిస్ బ్యాంక్ షేరు డీలా పడటమూ ప్రభావం చూపింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 7 పైసలు తగ్గి 85.40 వద్ద ముగిసింది. బ్రెంట్ ముడి చమురు 0.9% నష్టపోయి 65.96 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో చైనా, సింగపూర్ మినహా మిగతా దేశాల సూచీలు లాభాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు లాభాల్లో ఆరంభమయ్యాయి. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11.30 గంటలకు అమెరికా మార్కెట్ల ప్రధాన సూచీలైన డోజోన్స్ నష్టాల్లో, నాస్డాక్, ఎస్అండ్పీ లాభాల్లో కదలాడుతున్నాయి.
మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ గత రెండు ట్రేడింగ్ రోజుల్లో రూ.8.88 లక్షల కోట్లు ఆవిరై రూ.4,21,58,900.91 కోట్ల (4.93 లక్షల కోట్ల డాలర్ల)కు పరిమితమైంది. శుక్రవారం ఒక్క రోజే రూ.8.05 లక్షల కోట్ల సంపదను మదుపర్లు కోల్పోయారు.
స్వల్ప లాభాలతో మొదలై..: క్రితం ముగింపు 79,801.43 పాయింట్లతో పోలిస్తే, శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 79,830.15 పాయింట్ల వద్ద స్వల్ప లాభంతో ఆరంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీ, ఒకదశలో 78,605.81 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరింది. చివరకు కాస్త పుంజుకున్నా, 588.90 పాయింట్ల నష్టంతో 79,212.53 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 207.35 పాయింట్లు కోల్పోయి 24,039.35 వద్ద స్థిరపడింది.
రాణించిన ఐటీ షేర్లు: సెన్సెక్స్ 30 షేర్లలో ఏడు మినహా మిగతావన్నీ నష్టాల్లో ముగిశాయి. ఈ ఏడింటిలో 3 ఐటీ రంగ షేర్లే. టీసీఎస్ 1.36%, టెక్ మహీంద్రా 1.06%, ఇన్ఫోసిస్ 0.6% పెరిగాయి. మరోవైపు అదానీ పోర్ట్స్ 3.61%, యాక్సిస్ బ్యాంక్ 3.48%, ఎటర్నల్ 3.41%, బజాజ్ ఫిన్సర్వ్ 2.85%, పవర్గ్రిడ్ 2.56%, బజాజ్ ఫైనాన్స్ 2.01%చొప్పున నష్టపోయాయి.
