యువతను ఆహ్వానించేందుకు వినూత్న కార్యక్రమం
స్వచ్ఛభావాలతో రండి. అండగా ఉంటాం
తటస్టులపై ప్రత్యేక వ్యూహం
కాల్షీట్లన్నీపాలిటిక్స్ కోసమే
వైసీపీ పెరగకుండా చర్యలు

ఎం. గణేశ్, జర్నలిస్టు.
జనసేనాని, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇకనుంచి జనంతో మమేకం కానున్నారు. సేనతో సేనాని అనే వినూత్న కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. దీని కోసం పక్కా ప్రణాళిక రూపొందించారు. ఒక పోస్టర్ ని జనసేన పార్టీ నేతలు ఆవిష్కరించారు. రెండు నెలల క్రితం విశాఖపట్నంలో జరిగిన మూడు రోజుల కార్యకర్తల సభలో ఆయన త్రిశూల్ వ్యూహాన్ని ప్రకటించారు. సేనలో సేన అనే వినూత్న కార్యక్రమం ఇందులో ఉంది. ఇది పూర్తిగా పార్టీ పటిష్టతకు సంబంధించిన కార్యక్రమం. జిల్లాల వారీగా జనసేన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మమేకమవుతారు. కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను తెలుసుకుంటారు. అక్కడే రాజకీయాల పట్ల పారదర్శకత, సేవా తత్పరత భావాలు కలిగిన యువతీ యువకులను పార్టీలోకి ఆహ్వానిస్తారు.గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేస్తారు. 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాజకీయాలపై మరింతగా పట్టు సాధించాలనే లక్ష్యంతో ఆయన ఉన్నారు. కర్నూలు సభలో ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని చెప్పకనే చెప్పారు. 2026 ప్రారంభం నాటికి కొత్త వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. సేనతో సేనాని అనే వినూత్న కార్యక్రమం ఇందులో భాగంగా ప్రారంభించనున్నారు. జనసేన సిద్ధాంతాలను, పవనిజం అంశాలను కార్యకర్తల్లోకి తీసుకువెళ్తారు. తటస్థంగా ఉన్న యువతను ఆకర్షించేలా ఈ వ్యూహం ఉండబోతోంది. ఇప్పటికే ఆయన త్రిశూల్ వ్యూహాన్ని ప్రకటించారు. ఇక వచ్చే ఏడాది కాల్షీట్లు మొత్తం పాలిటిక్స్ కే అని చెబుతున్నారు. పవన్ డైరీలో ఆ ఏడాది మొత్తం రోజులు రాజకీయాలకే అని అంటున్నారు .జనంలోకి రావడం, వారితో మమేకం కావడం, అధికార స్థాయిలో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడం వంటివి పవన్ చేస్తారు. తన శాఖకు సంబంధించిన నిధుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు సహకారం తీసుకొని నేరుగా ఢిల్లీ పెద్దలను కలిసే విధంగా రూపొందించుకుంటున్నారు.ఏపీకి నిధులు తీసుకుని వచ్చే పనులు, అభివృద్ధి పనుల మీద ఫోకస్ పెడతారు.
వైసీపీ పెరగకూడదనే :

ఏపీలో పూర్తిగా కూటమికి అనుకూలంగా ఉందనే పవన్ భావిస్తున్నారు . పార్టీ పటిష్టవంతంగా ఉండాలంటే కార్యకర్తల అండ దండ అవసరం… కార్యకర్తలకు పార్టీ నేతపై నమ్మకం కలిగించేలా ఉంటేనే ఇది సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అనుకోని పరిస్థితులు ఎదురైనా వైసీపీ ఏమైనా బలపడితే మాత్రం ప్లాన్ బీ కోసం పవన్ సిద్దం అవుతున్నారు. ప్లాన్ బీ ద్వారా వైసీపీని దెబ్బ తీసే వ్యూహంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలసి బరిలోకి దిగి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా మరో ప్రయోగం చేసే ఆలోచనలో ఉన్నారు. జనసేన పార్టీ ని రాష్ట్రంలో వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తిస్థాయిలో పటిష్టవంతం చేసేందుకు ఆయన సేనతో సేనాని కార్యక్రమాన్ని పక్కాగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.మన నేల కోసం మనం నడుద్దాం అంటూ బలమైన నినాదాన్ని యువతలోకి పంపేలా ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారానే యువతలోకి వెళ్లవచ్చుననే నమ్మకంగా ఉన్నారు మార్పు అనేది కోరుకుంటే రాదు… బలంగా ప్రయత్నిస్తేనే సాధ్యమవుతుంది. ఇది కూడా తరచూ పవన్ నోట వెంట వినిపిస్తున్న మాటే. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించారు. దీనిని రిజిస్టర్ చేసుకోవాలని పవన్ యువతను కోరుతున్నారు..
