సైబర్ క్రైమ్ ముఠాల బారి నుంచి ఇద్దరు యువకులు త్రుటిలో తప్పించుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు పసిగట్టడంతో వారు సైబర్ ఉచ్చులో పడకుండా బయటపడ్డారు. ఉత్తర్ప్రదేశ్ బిజ్నూర్ జిల్లా ఖటాయ్కు చెందిన నబీల్ అహ్మద్(30) వాట్సప్కు యూఏఈలో ఉద్యోగం ఉందంటూ కొద్దిరోజుల క్రితం మెసేజ్ వచ్చింది. చాటింగ్ చేసిన వ్యక్తి తన పేరు జాసన్ అని పరిచయంచేసుకున్నాడు. కంబోడియాలో మంచి వేతనంతో కూడిన డేటాఎంట్రీ ఉద్యోగం ఉందని చెప్పడంతో నబీల్ ఆసక్తి చూపారు. నబీల్ను వాట్సప్ గ్రూప్లో చేర్చాడు. అందులో చైనా దేశస్థుడు ట్యాంక్ను టీం లీడర్గా పరిచయం చేశాడు. అదే గ్రూప్లో ఉన్న ఉత్తర్ప్రదేశ్కే చెందిన అహ్మద్ అనే యువకుడు కంబోడియాలో ఉద్యోగానికి ఎంపికైనట్లు చెప్పాడు. ఇద్దరికీ వీసా, విమాన టికెట్లను షాహిల్ అలియాస్ అజీమ్ సమకూరుస్తాడని వివరించాడు.
ఏప్రిల్ 25న దిల్లీ నుంచి కంబోడియా వెళ్లాల్సి ఉండగా భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం కావడంతో ఫ్లైట్ మిస్ అయింది. మరుసటి రోజు వెళ్లేందుకు షాహిల్ టికెట్లు పంపాడు. కానీ ఇమిగ్రేషన్ అధికారులు వీరి ప్రయాణానికి అభ్యంతరం చెప్పారు. టూరిస్ట్ వీసాపై వెళ్తున్నందున అక్కడ ఖర్చుల నిమిత్తం 500 యూఎస్ డాలర్లు ఉండాలని స్పష్టం చేశారు. దాంతో హైదరాబాద్ నుంచి కంబోడియాకు పంపించేలా ఏర్పాటు చేయాలని షాహిల్కు ట్యాంక్ సూచించాడు. ఇదేదో తేడాగా ఉందని భయపడిన వారిద్దరు ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. వారిద్దరిని మరో వాట్సప్గ్రూప్లో చేర్చి… మరికొందరు వస్తున్నందున వారితో కలిసి కంబోడియాకు చేరుకోవాలని షాహిల్ ఒప్పించాడు. దిల్లీ నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ నుంచి సింగపూర్ మీదుగా కంబోడియా వెళ్లేందుకు టికెట్లను, రిటర్న్ టికెట్లను వాట్సప్లో పంపించాడు.
అనంతరం వారు ఉంటున్న శంషాబాద్లో గోల్డెన్ ప్యాలెస్ హోటల్లో వారిని కలిశాడు. ఈనెల 15న వారిద్దరు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. తనిఖీల క్రమంలో రిటర్న్ టికెట్లు నకిలీవని బోర్డింగ్ అధికారి గుర్తించి అభ్యంతరం తెలిపారు. విషయాన్ని షాహిల్కు చెప్పడంతో వేరే రిటర్న్ టికెట్లను వాట్సప్లో పంపించాడు. అప్పటికే వీరిద్దరి ప్రవర్తనపై అనుమానంతో ఉన్న ఇమిగ్రేషన్ అధికారులు లోతుగా విచారించారు. కంబోడియా సైబర్క్రైమ్ ముఠాలు వారిని అపహరిస్తున్నాయని అర్థం కావడంతో వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. వారికీ విషయం అర్థమైంది. దీంతో తమను మోసగించేందుకు ప్రయత్నించిన ముఠాపై టీజీసీఎస్బీలో నబీల్ ఫిర్యాదు చేశారు.
