ఈ డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ మన జీవితంలో ఒక అంతర్భాగమైంది. ఆన్లైన్ షాపింగ్, బ్యాంకింగ్, సామాజిక వేదికలు.. ఇలా సమస్తం ఒక్క క్లిక్తో సాధ్యమవుతోంది. ఈ సౌలభ్యం మాటునే సైబర్ మోసాలు, సమాచార తస్కరణ వంటి ప్రమాదాలూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం జాగ్రత్తగా ఉండక తప్పదు.
ఒక పథకంలో మదుపు చేస్తే రూ.లక్షల్లోనే రాబడి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతునట్లుగా ఒక వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కృత్రిమ మేధ, డీప్ఫేక్లాంటి సాంకేతికతలతో తయారైన ఆ వీడియో మోసపూరితం. దీన్ని నమ్మి ఎంతో మంది తమ కష్టార్జితాన్ని కోల్పోయిన వార్తలూ వింటున్నాం. సామాజిక వేదికల్లో వచ్చే వాటిలో ఏదో ఒకటి తప్ప నిజాలు ఉండవన్నది ఎన్నో సందర్భాల్లో రుజువు అవుతూనే ఉంటుంది. ఇలాంటి పథకాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంది కదా అనే ఒక సందేహం వస్తే చాలు. మోసాల బారిన పడకుండా కాపాడుకోగలం.ఈ మోసాల నుంచి తప్పించుకోవాలంటే..
నీ బలమైన పాస్వర్డ్లతో: మీ ఆన్లైన్ ఖాతాలను రక్షించుకునేందుకు బలమైన, ప్రత్యేక పాస్వర్డ్లను ఉపయోగించండి. మీ పేరు, పుట్టిన తేదీ వంటి సులభంగా ఊహించే పాస్వర్డ్లు ఉండకూడదు. అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక చిహ్నాల మిశ్రమంతో కనీసం 12 అక్షరాల పాస్వర్డ్ను ఏర్పాటు చేసుకోండి. ప్రతి ఖాతాకూ వేర్వేరు పాస్వర్డ్లను వాడాలి. వీలైనంత వరకూ వీటిని గుర్తుంచుకోవడమే మేలు. లేదా ఒక చోట రాసి పెట్టుకోవాలి. ఫోన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్వర్డ్లను సేవ్ చేసుకోవద్దు.
రెండంచెల్లో: కేవలం పాస్వర్డ్తోనే లావాదేవీలు అయ్యేలా ఉండకూడదు. కచ్చితంగా ఫోన్కు ఓటీపీ లేదా బయోమెట్రిక్ వెరిఫికేషన్లాంటివి ఉండాలి. ఇది మీ ఖాతాను హ్యాకర్ల నుంచి రక్షిస్తుంది.
ఫోన్లు వస్తే: బ్యాంకు, ఆదాయపు పన్ను శాఖ అధికారులమని చెబుతూ వచ్చే ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దు. ఏ బ్యాంకు అధికారీ మీకు ఫోన్ చేసి ఖాతా వివరాలు, కార్డు నంబర్లు అడగరు. అనుమానాస్పద సందేశాలు, లింకులు ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు. ఇప్పుడు ఫోన్ నెట్వర్క్ ఆపరేటర్లు ఇలాంటి వాటిని నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. హెచ్చరిక వస్తే.. దాన్ని వదిలేయడం శ్రేయస్కరం.
అప్డేట్గా: మీ స్మార్ట్ఫోన్, కంప్యూటర్ యాప్లలోని సాఫ్ట్వేర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి. ఇది భద్రతా లోపాలను సరిచేస్తుంది. ఫలితంగా సైబర్ దాడుల నుంచి కొంత మేరకు రక్షణ లభిస్తుంది.
తనిఖీ చేస్తుండండి: మీ బ్యాంకు ఖాతాను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలి. నెలవారీ వచ్చే ఖాతా వివరాల స్టేట్మెంట్ను నిశితంగా గమనించాలి. యూపీఐ యాప్తో చేసిన చెల్లింపుల వివరాలతోనూ దాన్ని పోల్చి చూడాలి. అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి.
అవగాహన పెంచుకోండి: ఎవరికైనా ఫోన్ చేస్తున్నప్పుడు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పిస్తూ సందేశం వినిపిస్తోంది. సైబర్ నేరాలు రోజుకో కొత్త రూపాల్లో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిపై పూర్తి అవగాహన కలిగి ఉండటం ఎప్పుడూ మంచిది. ఏదైనా కొత్త మోసం గురించి మీకు తెలిసినప్పుడు, దానిపై కాస్త లోతుగా తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులకూ అవగాహన కల్పించాలి. సైబర్ మోసం బారిన పడినట్లు గుర్తించిన వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేయండి.
