అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అభివృద్ధి ప్రాజెక్టులపై వారితో విస్తృతంగా చర్చించారు. మియావాకీ విధానంతో పచ్చదనం పెంపు, ఉగ్రవాదంపై కఠిన నిర్ణయాలకు మద్దతు వంటి అంశాలపై ప్రధానితో భేటీ సందర్భంగా చర్చించారు.
అద్భుతమైన భవిష్యత్ దిశగా రాష్ట్రం జరిపే ప్రయాణంలో అమరావతి చరిత్రాత్మక మైలురాయి అవుతుంది. ఈ ప్రత్యేక ఘట్టాన్ని ప్రారంభించేందుకు, రాష్ట్రాభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి అమరావతికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించాను. ఆయన అంగీకరించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి ఆయన పలు సూచనలు కూడా చేశారని వెల్లడించారు. చంద్రబాబు శుక్రవారం ఢిల్లీలో ప్రధానితో సమావేశమయ్యారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరూ దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. రాజధాని నగర నిర్మాణం చేపడుతున్న తీరును, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిని, విశాఖ ఉక్కు కర్మాగారం పనితీరును వివరించారు.
రాజధాని పనులు ప్రారంభించేందుకు తాను తప్పకుండా వస్తానని చెప్పిన మోదీ.. రాజధానిని వేగవంతంగా నిర్మించేందుకు పలు సూచనలు చేశారు. దేశంలో అనేక మౌలిక సదుపాయాలను తన ప్రభుత్వం ఎంత వేగంగా నిర్మించిందో సీఎంకు తెలియజేశారు. అమరావతిలో పచ్చదనం పెంచేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని.. జపాన్ వన్య శాస్త్రవేత్త అకిరా మియావకీ అనుసరించిన అటవీ మొక్కల పెంపకం పద్ధతులను అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా పట్టణాల్లో స్వయం ఆధారిత సాంద్ర అడవులను పెంచేందుకు మియావాకీ సహజ అటవీ విధానాలు తోడ్పడతాయని, జీవ వైవిధ్యానికి కూడా ఉపయోగమని పేర్కొన్నారు
