భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమై, యుద్ధం వస్తుందనే ఆందోళనల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. బ్యాంకింగ్, చమురు షేర్లలో లాభాలు స్వీకరించడంతో సూచీలు నష్టాల్లో ముగిశాయి. యుద్ధం వచ్చినప్పుడు ఎలా మెలగాలనే అంశంపై ప్రజలకు సూచనలు ఇచ్చేందుకు మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర హోం శాఖ ఆదేశించడం సెంటిమెంట్పై ప్రభావం చూపింది. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు తగ్గి 84.35 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 2.76% లాభంతో 61.85 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ మంగళవారం రూ.6.17 లక్షల కోట్లు తగ్గి రూ.421.31 లక్షల కోట్లు (4.98 లక్షల కోట్ల డాలర్లు)గా నమోదైంది.
సెన్సెక్స్ ఉదయం 111 పాయింట్ల (క్రితం ముగింపు 80,796.84) లాభంతో 80,907.24 వద్ద ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీ, ఇంట్రాడేలో 315.81 పాయింట్లు తగ్గి 80,481.03 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 155.77 పాయింట్ల నష్టంతో 80,641.07 వద్ద ముగిసింది. నిఫ్టీ 81.55 పాయింట్లు కోల్పోయి 24,379.60 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 24,331.80- 24,509.65 పాయింట్ల మధ్య కదలాడింది.
సెన్సెక్స్ 30 షేర్లలో 16 డీలాపడ్డాయి. ఎటెర్నల్ 3.08%, టాటా మోటార్స్ 2.09%, ఎస్బీఐ 2.01%, అదానీ పోర్ట్స్ 1.96%, ఎన్టీపీసీ 1.95%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.78%, బజాజ్ ఫైనాన్స్ 1.52%, యాక్సిస్ బ్యాంక్ 1.06%, సన్ఫార్మా 0.89% నష్టపోయాయి. భారతీ ఎయిర్టెల్ 1.91%, టాటా స్టీల్ 1.62%, ఎం అండ్ ఎం 1.59%, హెచ్యూఎల్ 1.40%, నెస్లే 1.06% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో ఫోకస్డ్ స్థిరాస్తి 3.49%, విద్యుత్ 2,64%, సేవలు 2.53%, యుటిలిటీస్ 2.36%, పరిశ్రమలు 2%, యంత్ర పరికరాలు 1.71%, మన్నికైన వినిమయ వస్తువులు 1.59% పడ్డాయి. వాహన, టెక్ మెరిశాయి. బీఎస్ఈలో 3209 షేర్లు నష్టాల్లో ముగియగా, 742 స్క్రిప్లు లాభపడ్డాయి. 121 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
త్రైమాసిక ఫలితాలు మెప్పించకపోవడంతో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 10.27% తగ్గి రూ.223.65 దగ్గర స్థిరపడింది. సంస్థ మార్కెట్ విలువ రూ.13,238.68 కోట్లు తగ్గి రూ.1.15 లక్షల కోట్లకు చేరింది.
