మచిలీపట్నం బీచ్ ను అత్యద్బుతంగా తీర్చిదిద్దుతాం
10 లక్షలకు పైగా హాజరయ్యే అవకాశాలు
పర్యాటకులను ఆకర్షించే పలు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
ఏపీ స్టేట్ బ్యూరో.
వచ్చే జూన్ మాసం మొదటి వారంలో 4 రోజులపాటు మసులా ఫెస్ట్ పేరుతో మంగినపూడి బీచ్ ఉత్సవాలను నిర్వహించుటకు వీలుగా అన్ని ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం మంత్రి మంగినపూడి బీచ్ లోని ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
తొలుత ప్రవేశ మార్గంలో ఫిలిం ఆర్ట్ డైరెక్టర్ రమణ వంక ఏర్పాటు చేస్తున్న స్వాగత తోరణాలను మంత్రి పరిశీలించారు. స్వయంగా తోరణాల వెల్డింగ్ పనులను చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. తదుపరి మంత్రి అక్కడ ధర్మాకోల్ తో తయారు చేస్తున్న గౌతమ బుద్ధుడు, ఆక్టోపస్, డాల్ఫిన్, ఎండ్రకాయ, నక్షత్ర చేప, వివిధ రకాల చేపలు, తాబేలు, శంఖము, తదితర సముద్ర జీవులు, పాండురంగ స్వామి ఆకారాలతో బొమ్మలను పరిశీలించారు. వచ్చే జూన్ మొదటి వారం ముసులా ఫెస్ట్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి అధికారులను, ఫిలిం ఆర్ట్ డైరెక్టర్ ను ఆదేశించారు. బీచ్ లో ప్రధాన రహదారి వెడల్పు చేసి మధ్యలో ఒక కూడలి ఏర్పాటు చేసి అక్కడి నుండి హెలిపాడ్ వరకు రహదారి నిర్మించాలని సూచించారు.

అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బీచ్ ఉత్సవాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఫిలిం ఆర్ట్ డైరెక్టర్ రమణ వంకను పిలిపించామని, వారి ఆధ్వర్యంలో అమరావతికి ముఖద్వారంగా ఉండేలా ప్రవేశ మార్గంలో స్వాగత తోరణాలు, అసెంబ్లీ టవర్ తలపించే విధంగా రూపాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా అత్యద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మచిలీపట్నం బీచ్ ను తీర్చిదిద్దుతామన్నారు. మన రాష్ట్రం తో పాటు చుట్టుపక్కల పరిసరాల సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా కలంకారి, బందరు లడ్డు, హల్వా, బంగారు నగలు, డాల్ఫిన్, వివిధ రకాల చేపల ఆకృతులతో ధర్మాకోల్ బొమ్మలు రూపొందిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా జాతీయ క్రీడలైన బీచ్ కబడ్డీ, కయా కింగ్ జల క్రీడలు కూడా నిర్వహిస్తామన్నారు. ఈ క్రీడల్లో 2,000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు.

ఇవి కాక ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పారా గ్లైడింగ్, హెలికాప్టర్ రైడింగ్, నీటిలో నడిపే స్కూటర్లు, నీటిలో గ్లైడింగ్, స్కోవ డైవింగ్, మోటార్ స్పీడ్ బోట్లు తదితర సాహస క్రీడలు కూడా ఉంటాయన్నారు. అంతేకాకుండా ఉల్లాసం కోసం జెయింట్ వీల్స్, రకరకాల పూల ప్రదర్శన, మ్యూజికల్ ఫౌంటెన్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివిధ రకాల రుచికరమైన వంటకాల శాలలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉత్సవాలకు వచ్చే పర్యాటకులకు వినోదం కోసం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, ముఖ్యంగా ప్రముఖ సినీ కళాకారులు, సంగీత దర్శకులతో సంగీత విభావరి నిర్వహిస్తామన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని ఆహ్వానిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ పథకం కింద 100 నుంచి 150 కోట్ల రూపాయలు రానున్నాయని, ఇందుకోసం ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. దీని ఆధారంగా చేసుకుని పలు రకాల రిసార్టులు, హోటల్లు నెలకొల్పుటకు 800 నుంచి 1000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్నారు.
ఇదివరకు 2018లో మంగినపూడి బీచ్ ఉత్సవాలను మూడు రోజులపాటు నిర్వహించామని, 10 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పోలీసు రెవెన్యూ పర్యాటక అధికారులతో సమన్వయం చేసుకొని ఎంతమంది వచ్చినా రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
—
