ఢిల్లీ మద్యం కుంభకోణంలో వందకోట్లకే అక్కడి సీఎం, డిప్యూటీ సీఎంలు అరెస్ట్ అయ్యారు
• ఏపీలో వేల కోట్ల కుంభకోణం జరిగింది.. సిట్ విచారణలో నిజాలు బయటకు వస్తున్నాయి
• అందుకే అబద్దపు రాతలతో జగన్ రెడ్డి మీడియా విషం చిమ్ముతుంది
ఏపీ స్టేట్ బ్యూరో,
గత ప్రభుత్వంలో కమీషన్ ల కోసం పేరున్న బ్రాండ్ లను రాష్ట్రం నుండి తరిమికొట్టారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశలో ఆయన మాట్లాడారు. సొంత బ్రాండ్ లకే ఆర్డర్లు ఇచ్చి.. దోచుకోవడానికి డిజిటల్ లావాదేవీలు లేకుండా చేసి వేల కోట్లు కొల్లగొట్టారని.. ప్రభుత్వ మద్యం షాపుల్లో నాన్ డ్యూటీ లిక్కర్ ను అమ్మి.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారన్నారు… అలాగే నాసిరకం మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీశారని.. నేడు అవి ఒక్కొక్కటిగా సిట్ విచారణలో బయటకు వస్తున్నాయని తెలిపారు. ఓర్వలేని జగన్ రెడ్డి విషపత్రిక.. అబద్దాలను ప్రచారం చేస్తుందన్నారు.
నేడు వారు చేసిన పాపాలు బయటకు వస్తుంటే జగన్ రెడ్డి నీచ పేపర్ తప్పుడు కథనాలను ప్రచురిస్తుందన్నారు. జగన్ రెడ్డి తొత్తుల బాగోతాలు బయటపడుతుంటే అబద్ధాలను ప్రచారం చేసి ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన వైట్ పేపర్లలో ఏ విధంగా దోపిడీ చేశారో క్లియర్గా చెప్పామని, వైసీపీకి నాడు నెంబర్ 2గా ఉన్న వ్యక్తి కూడా విచారణలో ఇదే చెప్పారని వివరించారు. ఇప్పుడు విచారణ జరుగుతున్న వ్యక్తులను టీడీపీకి అంటగట్టాలని వైసీపీ చూడటం సిగ్గుచేటు. అని వివరించారు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, గోవిందప్ప, ధనుంజయరెడ్డి, విష్ణుమోహన్ రెడ్డిల పాత్రలపై స్పష్టమైన ఆధారాలతో వార్తలు వస్తుంటే.. తప్పుడు కథనాలు రాయిస్తూ మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటున్నారని తెలిపారు. వీరంతా నిన్నటి వరకు ఎవరితో ఉన్నారు? సీట్ విచారణలో పాత్రదారులు, సూత్రధారులు ఎవరెవరో అంతా బయటకు వస్తుందని తెలిపారు.
10 మద్యం డిపోలను తాకట్టు పెట్టి 13 వేల కోట్లు తీసుకొచ్చి దారి మళ్లించి కమీషన్లు కొళ్లగొట్టింది వాస్తవం కాదా? ఏఆర్ఈటీ అని పెట్టి 23 వేల కోట్లు అప్పులు తీసుకొచ్చింది వాస్తవం కాదా? భవిష్యత్కు సంబంధించి అమ్మకాలను తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఆ డబ్బులను దారి మళ్లించి కమీషన్ కొళ్లగొట్టింది వాస్తవం కాదా? ఆధాన్, లీలా, ఎన్వీ, v9, సోనా, మూనాక్ అనే కంపెనీలు 2019 ముందు ఏపీలో ఉన్నాయా? ఈ కంపెనీలు ఎలా పుట్టుకొచ్చాయి? దీనికి సమాధానం మీరు చెప్పగలరా? రేట్లు పెంచింది మీరు కాదా? ఎక్కడా డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా రూ. 99,413.5 కోట్లు ఓన్లీ క్యాష్ పేమెంట్ ను ప్రోత్సహించారని తెలిపారు. ఇంత డబ్బు ఎక్కడికి వెళ్లింది? ఎవరి ప్యాలెస్కు వెళ్లింది? డైరెక్ట్ గా షాపుల్లో వైసీపీ సొంత మనుషులను పెట్టుకొని ప్రభుత్వం నుండి సప్లై చేసే మద్యాన్ని లేకుండా చేసి.. నాన్ డ్యూటీ లిక్కర్ తెచ్చి అమ్మి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని తెలిపారు.
అధిక అద్దెలు చెల్లించి దోచుకున్నారు. సొంత బ్రాండ్లు మాత్రమే షాపుల్లో పెట్టి, మల్టీ నేషనల్ కంపెనీలను రానివ్వకుండా ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడిచారని తెలిపారు.నేడు దాదాపు 300 బ్రాండ్లకు ఆర్డర్లు ఇస్తున్నాం. మల్టీ నేషనల్ కంపెనీలు తిరిగి మన రాష్ట్రానికి వస్తున్నాయి. గతంలో ఉన్న వ్యత్యాసాన్ని కరెక్ట్ చేశాం. మద్యం రేటు పెరగాలన్నా, కొత్త బ్రాండ్లు తీసుకురావాలన్నా టెండర్ కమిటీ ఆధ్వర్యంలో జరగాలి. కానీ గత ఐదేళ్లు టెండర్ కమిటీ ఏర్పాటు చేయలేదని తెలిపారు. ఢిల్లీ కుంభకోణం కేవలం 100 కోట్లకు సంబంధించింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం, పక్క మాజీ ముఖ్యమంత్రి కూతురు, శరత్ చంద్రారెడ్డిలు అరెస్ట్ అయ్యారు. ఏపీలో జరిగింది వేల కోట్ల స్కాం. ఇది బయట పడుతుంటే.. తప్పుడు కథనాలు రాసి.. బురద చల్లి తప్పించుకోవాలనుకున్నా.. ఎవరూ తప్పించుకోలేరన్నారు.
