ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సింగపూర్లో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్తో భేటీ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై వారు చర్చించారు. రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానని మంత్రి టాన్ సీ లెంగ్కు సీఎం స్పష్టం చేశారు. సింగపూర్పై ఉన్న అభిమానంతో గతంలో హైదరాబాద్లో సింగపూర్ టౌన్షిప్ నిర్మించినట్లు తెలిపారు. నవంబరులో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని టాన్ సీ లెంగ్ను కోరారు. సింగపూర్ను చూసే హైదరాబాద్లో రాత్రిపూట రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. నాలెడ్జ్ ఎకానమీలో ఏపీకి చెందిన నిపుణులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్మిషన్ కారిడార్లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని కోరారు. డేటా సెంటర్ల ఏర్పాటులోనూ భాగస్వామ్యం అవసరమన్నారు. ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలిపారు. పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో ఉత్తమ విధానాలను అనుసరించడంలో సహకరించాలని కోరారు.
గ్రీన్ ఎనర్జీ, సబ్ సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని సింగపూర్ మంత్రి టాన్ సీ లెంగ్ తెలిపారు. గృహ నిర్మాణ రంగంలోనూ ఏపీతో కలిసి పని చేసేందుకు సిద్ధమని తెలిపారు. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేశ్, నారాయణ, టీజీ భరత్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. (Andhra Pradesh News)
