‘నేతన్న భరోసా’ పథకం కింద చేనేతలకు ఏటా రూ.25 వేలు ఆర్థికసాయం అందించబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఈ నెల నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. దీనికి ఏడాదికి రూ.193 కోట్లు వ్యయమవుతుందని వివరించారు. చేనేత వస్త్రాలపై చెల్లించాల్సిన 5 శాతం జీఎస్టీని ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుందని.. ఇందుకోసం రూ.15 కోట్లు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో నిలిపేసిన త్రిఫ్ట్ ఫండ్ను అమల్లోకి తెస్తూ 5,386 మందికి రూ.5 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. చేనేతల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అమలు చేస్తామని ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ‘చరిత్రలో ఎన్నడూ చూడని సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం. అభివృద్ధిని పట్టాలెక్కించి, సంక్షేమానికి రాజమార్గం వేశాం. రాజధాని అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తాం. వెంకటగిరి, మంగళగిరి, ఉప్పాడ, శ్రీకాళహస్తి, రాజాంలలో రూ.74 కోట్లతో క్లస్టర్లను అందుబాటులోకి తీసుకొస్తాం. ఇక్కడ 1,374 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. మంగళగిరిలో అమలవుతున్న వీవర్స్శాల వినూత్న కార్యక్రమం. బయటతో పోలిస్తే ఇక్కడ నేతన్నలకు 30 శాతం ఎక్కువ ఆదాయం వస్తోంది. వీటిని రాష్ట్రమంతా అందుబాటులోకి తీసుకొస్తాం. ఓఎన్డీసీ కింద చేనేత ఉత్పత్తులను విస్తరిస్తున్నాం.
ఆదరణ-3 కింద ఆధునిక మగ్గాలు
ఆదరణ-3 పథకం కింద చేనేతలకు ఆధునిక మగ్గాలు అందిస్తాం. బీసీలు మూడు కిలోవాట్ల సోలార్ ప్యానల్స్ ఇంటిపై ఏర్పాటు చేసుకుంటే రూ.98 వేలు రాయితీ అందిస్తాం. వీటిని ఏర్పాటు చేసుకున్న చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అమలు చేయడంతోపాటు వారు ఉత్పత్తి చేసిన విద్యుత్తుకు డబ్బు చెల్లిస్తాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. చేనేతల అభివృద్ధికి పారిశ్రామికవేత్త సుచిత్ర ఎల్లను సలహాదారుగా నియమించాం. ఈ రంగం అభివృద్ధికి టాటా, బిర్లా తరహా భారీ కంపెనీలు ముందుకొస్తున్నాయి. దేశంలో బెస్ట్ డిజైనర్లందరినీ ఎంప్యానల్ చేయాలని అధికారులను ఆదేశించా. చేనేత వస్త్రాలు ఏ ఊళ్లో ఎప్పుడు నేశారు… నేతన్న పడుతున్న కష్టం తెలిస్తే అధిక ధర వెచ్చించి అయినా వినియోగదారులు కొనుగోలు చేస్తారు. ఇందుకోసం ఆ ఉత్పత్తులకు ట్రేసబులిటీ ప్రవేశపెడతాం.
