సమాజాన్ని తప్పుదారి పట్టించే పోస్టులు పెడిగే జైలుకే.
చట్టం ముందు అంతా సమానమే.
నిజాయితీతో కూడిన సమాచార మార్పిడికి సోషల్ మీడియాను వాడండి
డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
ఏపీ ఎనాలిసిస్, విజయవాడ.
సోషల్ మీడియాలో వ్యక్తులు, వ్యవస్థల ప్రతిష్టకు భంగం కలిగించేలా, దురుద్దేశాలను ఆపాదిస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తూ… ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అనుచిత, విద్వేష పూరిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా… సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తున్న కొంతమందిని ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. వీరిపై పలు సెక్షన్ల క్రింద క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని తెలిపారు. ఎవరు ఎంత పెద్దవారైనా, ఏ సంస్థలో పనిచేస్తున్న వారైనా చట్టం ముందు అందరూ సమానులేనని, ఎవరూ మినహాయింపు కాదని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాపై నిరంతర నిఘా
వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తూ… సోషల్ మీడియా వేదిక ద్వారా జాతి, మతం, భాష, ప్రాంతం, కులం, వర్గం, వ్యక్తులు లేదా వ్యవస్థల మధ్య విభేదాల సృష్టించేలా పోస్టులు పెడితే బిఎన్ఎస్ 353 (2) (3) సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి… ఆయా వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని… సంబంధిత సంస్థల దృష్టికి తీసుకువెళ్లి, ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న వారిని ఉద్యోగం నుండి తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వివాదాలు, ఘర్షణలకు దారి తీసే సున్నితమైన అంశాలతో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో ఫేక్ కంటెంట్ క్రియేట్ చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సోషల్ మీడియాపై నిరంతర నిఘా ఉందని, అనుచిత కంటెట్ పోస్టు చేసిన వారిని సాంకేతిక ఆధారాలతో గుర్తించి, తక్షణమే అరెస్టు చేసి న్యాయ స్థానాల్లో శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.. పోలీస్ శాఖను అపఖ్యాతి పరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ హెచ్చరించారు. చట్టపరమైన సమాచారాన్ని పంపే ముందు నిజానిజాలు నిర్ధారించుకోవాలని లేకపోతే చిక్కులు తప్పవని హెచ్చరించారు. నిజాయితీతో కూడిన సమాచార మార్పిడికి వేదికగా సోషల్ మీడియా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీజీపీ విజ్ఞప్తి చేసారు.
