భారతీయ రైల్వే (Indian Railways) టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల విషయంలో కీలక మార్పులు చేసింది. ట్రైన్ బయల్దేరే సమయం ఆధారంగా టికెట్ సొమ్మును రిఫండ్ చేసే విధానాన్ని సవరించింది. కొత్త రూల్స్ ప్రకారం 72 గంటల ముందు ఎవరైనా కన్ఫామ్ టికెట్ను రద్దు చేసుకుంటే పూర్తి మొత్తం రిఫండ్ (క్యాన్సిలేషన్ ఛార్జీలకు లోబడి) చేసేలా మార్పులు చేసింది. బోర్డింగ్ పాయింట్ నిబంధనలనూ మార్చింది. ఈ మేరకు కొత్తగా తీసుకొచ్చిన పలు సంస్కరణలను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 మధ్య దశలవారీగా ఈ మార్పులు అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
కొత్త రూల్స్ ఇలా..
ప్రయాణానికి 72 గంటల ముందు టికెట్ను రద్దు చేసుకుంటే ‘మ్యాగ్జిమమ్ రిఫండ్’ చేస్తారు. కొంత క్యాన్సిలేషన్ ఛార్జీలను ఉపసంహరించుకుని మిగిలిన మొత్తాన్ని రిఫండ్ చేస్తారు.
ట్రైన్ బయల్దేరడానికి 72 గంటల నుంచి 24 గంటల మధ్య టికెట్ రద్దు చేస్తే ‘స్టాండర్డ్ పెనాల్టీ’ విధిస్తారు. టికెట్ ధరలో 25 శాతం మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని (కనీస ఛార్జి ఆధారంగా) రిఫండ్ చేస్తారు.
ట్రైన్ బయల్దేరడానికి 24 గంటల ముందు నుంచి 8 గంటల మధ్య టికెట్ రద్దు చేసుకుంటే ‘లేట్ క్యాన్సిలేషన్’గా పరిగణించి 50 శాతం ఫేర్ను మినహాయించి మిగిలిన మొత్తం రిఫండ్ చేస్తారు.
ప్రయాణానికి 8 గంటల ముందు గానీ, ట్రైన్ బయల్దేరిన తర్వాత ఎవరైనా టికెట్ రద్దు చేసుకుంటే ఎలాంటి రిఫండ్ ఉండదు.
దీంతో పాటు ప్రయాణానికి 30 నిమిషాల ముందు వరకు బోర్డింగ్ పాయింట్ మార్చుకునే సదుపాయాన్నీ రైల్వేశాఖ కల్పించింది. ముఖ్యంగా నగరాల్లో ఎక్కువ స్టేషన్లు ఉన్నప్పుడు ఈ వెసులుబాటును ప్రయాణికులు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి చార్ట్ ప్రిపేర్ చేయడానికి ముందు వరకు మాత్రమే అనుమతిస్తున్నారు.
గతంలో కౌంటర్ టికెట్ను రద్దు చేసుకోవాలంటే రైలు ప్రారంభమయ్యే స్టేషన్లో మాత్రమే వెసులుబాటు ఉంది. ఇకపై ఏ స్టేషన్లోనైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు.
అలాగే, ఇ-టికెట్ కలిగిన ప్రయాణికులు టికెట్ డిపాజిట్ రిసీట్ (TDR) ఫైల్ చేయాలంటే మాన్యువల్గా చేయాల్సి వచ్చేది. ఇకపై ప్రయాణికుడి ప్రమేయం లేకుండా టీడీఆర్ రూల్స్ను అనుసరించి ఆటోమేటిక్గా రిఫండ్ చేస్తారు.
కౌంటర్ టికెట్పై ప్రయాణానికి 30 నిమిషాల ముందు కూడా ఇకపై ప్రయాణ తరగతిని అప్గ్రేడ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
క్యాన్సిలేషన్ ఛార్జీలు ప్రస్తుతం ఇలా..
ప్రస్తుతం రైలు బయల్దేరడానికి 48 గంటల ముందు టికెట్ రద్దు చేసుకుంటే ఏసీ ఎగ్జిక్యూటివ్/ ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల నుంచి రూ.240+ జీఎస్టీ; ఏసీ 2 టైర్/ ఫస్ట్క్లాస్కు రూ.200+ జీఎస్టీ; ఏసీ త్రీటైర్/ ఏసీ ఛైర్ కార్/ ఏసీ ఎకానమీ తరగతి టికెట్లకు రూ.180+ జీఎస్టీ చొప్పున క్యాన్సిలేషన్ ఛార్జీలు విధిస్తున్నారు. స్లీపర్ క్లాస్కు రూ.120, సెకండ్ క్లాస్కు రూ.60 చొప్పున వసూలు చేస్తున్నారు.
అదే ప్రయాణానికి 48 గంటల నుంచి 12 గంటల ముందైతే 25 శాతం, 12 గంటల నుంచి 4 గంటల మధ్య 50 శాతం టికెట్ ధరను మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని రిఫండ్ చేస్తున్నారు. ప్రయాణానికి 4 గంటల కంటే తక్కువ సమయం ఉంటే రిఫండ్ను అనుమతించడం లేదు.
