తమ ప్రభుత్వం రూపొందిస్తున్న విధానాలు రానున్న వెయ్యేళ్ల భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరిపాలక సిబ్బంది పనితీరు, విధాన రూపకల్పన కాలం చెల్లిన పద్ధతుల్లో సాగరాదని సూచించారు. దిల్లీలో సోమవారం జరిగిన 17వ సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తన దార్శనికతకు కార్యరూపమిచ్చే దిశగా ప్రతి ఒక్కరూ అలుపెరగకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన అధికార సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ‘‘ప్రభుత్వ పరిపాలక సిబ్బంది ‘‘నాగరిక్ దేవోభవ’’ (పౌరుడే దేవుడు) అనే మంత్రానికి కార్యరూపమిస్తూ అట్టడుగు వర్గాల సమస్యల్ని పరిష్కరించాలి. అభివృద్ధిలో అందరినీ కలుపుకొని పోయేందుకు చివరి వరకూ కృషి చేయాలి. సివిల్ సర్వెంట్లు కేవలం పరిపాలక సిబ్బందిగా కాక అభివృద్ధి చెందిన దేశ నిర్మాతలుగా తమను తాము భావించుకోవాలి. దేశంలో అందరి కనీస అవసరాలను తీర్చడం అధికారుల ప్రాధాన్యత కావాలి. పరిపాలన ఫలాలను చివరి వ్యక్తి వరకూ చేర్చాలి. పౌరుల అవసరాలు, ఆకాంక్షలూ మారుతున్నాయి. సమకాలీన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉన్నతాధికారులు తమను తాము తీర్చిదిద్దుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానం ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నా మానవ విచక్షణే ప్రధానం. ప్రజా సమస్యల పట్ల స్పందించే గుణం కలిగి ఉండాలి. అట్టడుగు వర్గాల ప్రజల వాణిని వినాలి. ఆ వర్గాల కష్టాలను అర్థం చేసుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నిబద్ధతతో, దయతో అధికారులు తమ బాధ్యతల్ని నిర్వర్తించాలి. పౌరుల పౌష్టికాహార స్థాయిని పెంచడానికి పునరంకితమవ్వాలి. ఈ విషయంలో 100 శాతం విజయం సాధించాలి. ప్రపంచంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో అంకుర సంస్థలకు, యువ ఔత్సాహికులకు గతంలో ఎన్నడూ లేనన్ని అవకాశాలు ఏర్పడ్డాయి. సాంకేతికత రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో పరిపాలన అంటే కేవలం వ్యవస్థల నిర్వహణ కాదు. అవకాశాలు అనేక రెట్లు పెరిగేలా పని చేయడమే’’ అని మోదీ అన్నారు.
జిల్లాల సమగ్ర అభివృద్ధి, ప్రజాకాంక్షల పూర్తి, పరిపాలనలో నవ్యత వంటి వివిధ కేటగిరీల కింద 16 అవార్డులను మోదీ సివిల్ సర్వెంట్లకు ఈ సందర్భంగా అందజేశారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి జితేంద్ర సింగ్, ప్రధానమంత్రి ముఖ్యకార్యదర్శి – 2 శక్తికాంత దాస్, క్యాబినెట్ కార్యదర్శి టి.వి.సోమనాథన్, పరిపాలనా సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల శాఖ కార్యదర్శి వి.శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
