నవమాసాలు మోసి కనిపెంచిన కుమారుడే తల్లిదండ్రుల పాలిట కాలయముడయ్యాడు. భూమి పంపకంపై కక్ష పెంచుకుని ట్రాక్టర్తో వెంబడించి, తొక్కించి నిండు ప్రాణాలను బలిగొన్నాడు. ప్రాణభయంతో వారు పరుగులు తీస్తున్నా వదిలిపెట్టలేదు. ఈ దుర్ఘటన విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. చల్లవానితోట పంచాయతీ నడుపూరి కల్లాలు గ్రామానికి చెందిన పాండ్రంకి అప్పలనాయుడు (55), జయ (45)కు కుమారుడు రాజశేఖర్, కుమార్తె రాధాకుమారి ఉన్నారు. రాధాకుమారికి కొన్నేళ్ల కిందట విశాఖ జిల్లా ఆనందపురానికి చెందిన వ్యక్తితో పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో తమకున్న ఎకరా భూమిలో 20 సెంట్లు ఆమెకు తల్లిదండ్రులు రాసిచ్చారు. ఐదేళ్ల కిందట రాధాకుమారి భర్త చనిపోగా కుమారుడితో కలిసి ఆమె తన ఇంటి వద్ద నివసిస్తున్నారు. మిగిలిన ఆస్తి పంపకాలలో తల్లిదండ్రులు, కుమారుడి మధ్య రెండేళ్లుగా వివాదం కొనసాగుతోంది.
భూమిని తల్లిదండ్రులు, కుమారుడికి పంచుతూ పంచాయితీలో గ్రామ పెద్దలు తీర్మానించారు. కుటుంబ అప్పులను తీర్చడానికి 12 సెంట్లు కేటాయించారు. త్వరలో భూమి అమ్మి అప్పు తీర్చాక మిగిలిన సొమ్మును తనకివ్వాలని కుమారుడు పట్టుబట్టాడు. అతడి తీరు నచ్చని తల్లిదండ్రులు తమకు వచ్చిన భూమిలో 30 సెంట్లను కుమార్తె పేరున రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో తల్లిదండ్రులపై రాజశేఖర్ మరింత కక్ష పెంచుకున్నాడు. పొలంలో కొంత భాగం విక్రయించాలనే ఉద్దేశంతో ట్రాక్టర్తో చదునుకు శనివారం ప్రయత్నించాడు. ఈ పనులను తల్లిదండ్రులు అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురై ట్రాక్టర్ను వారిపై ఎక్కించేందుకు రాజశేఖర్ ప్రయత్నించాడు. భయంతో వారు మొక్కజొన్న తోటలోకి పరుగు తీశారు. అయినా విడవకుండా తోటలోకి ట్రాక్టర్తో వెళ్లి వారిని తొక్కించేశాడు. దీంతో తల్లిదండ్రులు అక్కడికక్కడే చనిపోయారు. అనంతరం రాజశేఖర్ భార్యతో కలిసి జిల్లాకేంద్రంలోని పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు.కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
