చాలా మంది ఫ్రాంఛైజీలు సృష్టిస్తుంటారు. అవి ఎన్ని రోజులుంటాయి.. ఎక్కడి దాకా వెళ్తాయి ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కానీ, శైలేశ్ ‘హిట్: ఫస్ట్ కేస్’ (Hit 3) అని ప్రకటించగానే.. ఇది ఓ అనంతమైన ఫ్రాంఛైజీలా ముందుకెళ్తూనే ఉంటుంది అందరికీ అర్థమైపోయింది. ఇది నిజంగా అలాగే కొనసాగాలని కోరుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు రాజమౌళి (SS Rajamouli). ఆయన ఆదివారం రాత్రి హైదరాబాద్లో జరిగిన ‘హిట్: ది థర్డ్ కేస్’ చిత్ర విడుదల ముందస్తు వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాని (Nani) కథానాయకుడిగా శైలేశ్ కొలను రూపొందించిన పాన్ ఇండియా చిత్రమిది. యునానిమస్ పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కథానాయిక. ఈ సినిమా మే 1న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా మా సినిమాలకు సంబంధించి ఏమైనా లీక్స్ వచ్చినప్పుడు నాకు చాలా కోపం వస్తుంటుంది. అయితే ఈ మధ్య ‘హిట్ 3’ ఇంటర్వ్యూ చూస్తునప్పుడు తన చిత్ర లీక్స్ గురించి శైలేశ్ ఎంతో పరిణతితో మాట్లాడిన తీరు నన్నెంతో ఆకట్టుకుంది. నిజానికి పోలీస్ కేసులకు అంతం లేదు. వాటితో ఎన్ని చిత్రాలైనా చేసుకుంటూ పోవచ్చు. ఈ ‘హిట్’ ఫ్రాంఛైజీ అలా కొనసాగాలని కోరుకుంటున్నా. నాని ఏ చిత్రం చేసినా అది పక్కా హిట్టని ముందే అర్థమైపోతుంటుంది.
కానీ, ఆ తర్వాత తన నుంచి ఇంత కన్నా ఎక్కువ రావాలని కోరుకుంటుంటా. గతంలో నేను ఊహించిన దాని కన్నా నాని ఇప్పుడు చాలా ముందుకెళ్లిపోయాడు. కానీ, ఇప్పటికీ నా ఆశైతే తీరదు. తనింకా పైకి ఎదగాలని కోరుకుంటున్నా. కచ్చితంగా ఇది సూపర్ డూపర్ హిట్టవుతుందన్న సంకేతాలు అందుతున్నాయి’’ అన్నారు. ఈ సందర్భంగా ‘‘మహాభారతం’లో నాని ఉంటారా?’’ అని వ్యాఖ్యాత సుమ రాజమౌళిని ప్రశ్నించగా.. ‘కచ్చితంగా.. నాని ఉంటాడన్నది పక్కా’’ అని బదులిచ్చారు.
నాని మాట్లాడుతూ.. ‘‘నా సినిమా విడుదలైన తొలి రోజు ప్రసాద్ ఐమాక్స్లో రాజమౌళి తన కుటుంబంతో కనిపిస్తే నాకొక ఆనందం. ఆయన ఏ స్క్రీన్లో ఉన్నారో కనుక్కొని.. నేను ఆ డోర్ దగ్గర నుంచొని వాళ్లు సినిమాని ఎలా ఆస్వాదిస్తున్నారో గమనిస్తుంటా. ఆయన సినిమా చూసి బయటకొచ్చాక ‘నేను నీకు మెసేజ్ పెడతా అన్నా’రంటే సినిమా హిట్ అన్నట్లే లెక్క. ఈ మధ్య మేము థియేటర్లకు వెళ్లడం తగ్గిపోయింది. కానీ, ఈసారి మీకు ఎన్ని పనులున్నా.. నా ‘హిట్ 3’ చూడాలని రాజమౌళిని కోరుతున్నా. అవసరమైతే అంత వరకు నేను తన పాస్పోర్ట్ లాక్కుంటా (నవ్వుతూ). మీరు ఈ వేడుకకు వచ్చారు కాబట్టి కచ్చితంగా మే 1న బ్లాక్బస్టర్ కొడుతున్నాం.
ఈ ‘హిట్’ యూనివర్స్కు విష్వక్, అడివి శేష్ మూలస్తంభాలు. దాన్ని మేము ఈ చిత్రంతో మరోస్థాయికి తీసుకెళ్లనున్నాం. ఒక మంచి థ్రిల్లర్ సినిమాకి ఓ చక్కటి కమర్షియల్ మాస్ చిత్రం కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందీ ‘హిట్ 3’. ఈ చిత్రంలో ఉన్న హింస మిమ్మల్ని ఎక్కడా ఇబ్బంది పెట్టదు. అందరూ ఎంజాయ్ చేసేలా.. విజిల్స్ వేయించేలాగే ఉంటుంది. మంచి థియేట్రికల్ అనుభూతిని అందిస్తుంది. ఈ చిత్రంలో మంచి మూమెంట్ ఒకటుంది. అది రాజమౌళి సినిమాల్లోని హై మూమెంట్లా ఉంటుందని నమ్ముతున్నా. మే 1న మీ నాని మీకొక అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందిస్తాడని మాటిస్తున్నా. ‘హిట్టు 3’ మీద గట్టి నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు.
‘‘పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా నివాళి. మాకు ఆ ప్రాంతంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మేము ఈ ‘హిట్ 3’ని పహల్గాంలో చిత్రీకరణ జరిపాం. అది మాకెన్నో మధుర జ్ఞాపకాల్ని అందించింది. అలాంటి చోట ఇంత విషాదం జరగడం బాధాకరం. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు నానికి రెండు ప్రమాదాలు జరిగాయి. తనకు గాయాలై రక్తస్రావమైనా విశ్రాంతి తీసుకోకుండా అలాగే చిత్రీకరణలో పాల్గొన్నారు. నటన పట్ల తనకున్న నిబద్ధతకు నిదర్శనమది’’ అన్నారు దర్శకుడు శైలేశ్ కొలను.
హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. ‘‘హిట్ 3’ చివరి 30నిమిషాలు చూశా. చాలా బీభత్సంగా ఉంటుంది. దీంట్లో మీకు తెలియని సర్ప్రైజ్లు చాలా ఉన్నాయి. ఈ సినిమా తప్పకుండా అందర్నీ అలరిస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రమా రాజమౌళి, శ్రీనిధి శెట్టి, విష్వక్ సేన్, ప్రశాంతి, దీప్తి గంటా, రామ్ జగదీశ్, సూర్య శ్రీనివాస్, మాగంటి శ్రీనాథ్, నాగేంద్ర తంగల, అమిత్, సాను జాన్ వర్ఘీస్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
