ఆసక్తిగా ప్రజలు, వ్యాపార, రాజకీయ వర్గాలు
ప్రజల రాకపోకల కోసం 14 వేల బస్సులు
చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం
ఏపీ స్టేట్ బ్యూరో,
అమరావతి సభలో ప్రధాని మోదీ ప్రకటన కోసం అన్ని వర్గాలు వేచి చూస్తున్నాయి. ప్రజలు, వ్యాపార, రాజకీయ వర్గాలు మరింత ఆసక్తిగా ఉన్నాయి. రాజధాని గ్రామాల ప్రజలైతే తమ దిశ ఈసారి మారుతుందనే ధీమాతో ఉన్నారు. తామంతా కోట్లకు పడటలెత్తుతామనే భావనతో ఉన్నారు. ఇప్పటికే రాజధాని గ్రామాల్లోని పొలాలు, స్ధలాల ధరలు సామాన్యుల అంచనాకు మించి ఉన్నాయి. ఇక ప్రధాని మోది అమరావతి నిర్మాణానికి అనుకూలమైన ప్రకటన చేస్తే, కృష్ణా, గుంటూరు జిల్లాలు జట్ వేగంతో పరుగులెత్తుతాయి. ఇప్పటికే అమరావతి కోసం కేంద్రం పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచింది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ 13 వేల కోట్ల రుణం మంజూరైంది.
చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు :
అమరావతి పనుల రీ లాంఛ్ కోసం జరిగే ఈ సభ నుంచి ప్రధాని పలు శంకుస్థాపనలు చేయనున్నారు. కాగా, ప్రభుత్వం ఈ సభ కోసం పలువురు ప్రముఖులను ఆహ్వానించింది. మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేక అతిధిగా ఆహ్వానించారు. మరోసారి ప్రధానితో కలిసి చిరంజీవి వేదికను పంచుకోనున్నారు. ఇతర అతిధులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ప్రధాని సభ కోసం ప్రధాని మోదీ అమరావతి సభను ప్రభుత్వం భారీగా నిర్వహించేందుకు సిద్దమైంది. శుక్రవారం మధ్యాహ్నం 2:55 గంటలకు మోదీ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో మోదీకి మంత్రులు, కూమిటి నేతలు స్వాగతం పలుకనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం 3:15 గంటలకు వెలగపూడి సచివాలయం వద్ద ఉన్న హెలిపాడ్కు పీఎం చేరుకుంటారు. హెలిపాడ్ వద్ద ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలకనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు సభాస్థలికి చేరుకుని అమరావతి పున:ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు. అమరావతిలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కేంద్రం చేపట్టిన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఒక గంటా 15 నిమిషాల పాటు ప్రధాని మోదీ సభలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం 4:55 గంటలకు తిరిగి హెలికాఫ్టర్ ద్వారా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు మోదీ. అక్కడి నుంచి విమానం ద్వారా ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా, ప్రధాని సభకు 14 మంది ప్రముఖులకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపింది. మాజీ సీఎం జగన్ తో పాటుగా చిరంజీవి, కేంద్ర మంత్రులను ఆహ్వానించింది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ సభకు హాజరు కానున్నారు.
తాడికొండ నుంచి వెలగపూడి వరకు రైతులు ర్యాలీగా సభకు హాజరు కానున్నారు.. ప్రధాని సభకు దాదాపు 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రాజధాని ప్రజల కోసం ఎనిమిది వేల బస్సు.. రాజధాని చుట్టుపక్కల గ్రామాల ప్రజల కోసం ఆరువేలకుపైగా బస్సులను సిద్ధం చేశారు.
