గగనతలంలో కానవచ్చే గుల్లలమోద క్షిపణి…
దివిసీమ లో అతిపెద్ద రక్షణ రంగ ప్రాజెక్టు…
నవ్యాంధ్ర ప్రదేశ్ కి కంఠాభరణంగా
వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
ఏపీ స్టేట్ బ్యూరో,
అది ఓ మారుమూల గ్రామం . కృష్ణా జిల్లా నాగాయలంక మండలం కృష్ణానది తీరంలో విసిరేసినట్టు కాన వస్తుంది ఆ గ్రామం. ఆ ఊరిపుడు ప్రపంచ పటంలో కనిపించబోతుంది. అక్కడ మన దేశ రక్షణ రంగ సంస్థ ఓ అతి పెద్ద భారీ ప్రాజెక్టును నిర్మించబోతోంది. ఇక్కడ క్షిపణి పరీక్ష ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
కేంద్ర రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డి ఆర్ డి ఓ) ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. ఇందుకు సంబంధించిన పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. రూ. 2300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గుల్లలమోదలో నిర్మించబోయే క్షిపణి పరీక్షా ప్రయోగ కేంద్రం ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ పూర్తయింది. ఇందుకోసం 386 ఎకరాలను డిఆర్డిఓకు అప్పగించారు. అమరావతిలో అభివృద్ధి పనులు శంకుస్థాపనకు శుక్రవారం విచ్చేస్తున్న నరేంద్ర మోడీ ఈ క్షిపణి పరీక్ష ప్రయోగ కేంద్రానికి వర్చువల్ గా భూమి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు . గుల్లలమోద లో ఈ ప్రాజెక్టు నిర్మించాలని రక్షణ రంగ సంస్థ గతంలోనే తలపెట్టినా అనేక అడ్డంకులు ఎదురు కావడంతో ఇప్పటివరకు నిరీక్షించాల్సి వచ్చింది. 2019లో కృష్ణా నదికి వచ్చిన వరదలు తదుపరి కరోనా ఉధృతి వల్ల ఈ ప్రాజెక్టు నిర్మాణం కార్యరూపం దాల్చలేదు . అంతేకాకుండా గత వైసిపి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణం పట్ల అంతగా ఆసక్తి చూపలేదనే అభిప్రాయము ఉంది.
ఈ నేపద్యంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చాక ఈ ప్రాజెక్టు పై దృష్టి సారించారు . దానిలో భాగంగానే స్థానిక అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ చొరవతో కదలికలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఊతం ఇవ్వడంతో పనులు వేగవంతమయ్యాయి. అలాగే అడ్డంకులు ఒక్కొక్కటి తొలగడంతో భూమి పూజ కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల దివిసీమ అనేక మౌలిక వసతులను సంతరించుకోబోతుంది.
ముఖ్యంగా విస్తరణ తో కూడిన రహదారుల అభివృద్ధి జరగనుంది . వందలాదిమంది శాస్త్రవేత్తలు ఇక్కడ నివాసం ఉండనున్నారు. దాదాపు 300 మంది శాస్త్రవేత్తలకు ఇక్కడ నివాస ఏర్పాట్లు చేయనున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగు పడనున్నాయి . క్షిపణి పరీక్ష ప్రయోగ కేంద్రం కోసం గుల్లలమోదలో 386 ఎకరాల అటవీ భూమిని డి ఆర్ డి ఓ కి అప్పగించగా గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలో మరో రెండు ఎకరాలను ఆ ప్రాంతంలో గెస్ట్ హౌస్ , కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించడం జరిగింది . గుల్లలమోద లో ఏర్పాటు చేయనున్న ఈ క్షిపణి పరీక్ష ప్రయోగ కేంద్ర ప్రాంతంలో వన్యప్రాణులు ఉండడంతో అటవీ శాఖ నుంచి షరతులతో కూడిన అనుమతులు లభించాయి. అలాగే ఈ నిర్మాణానికి అవసరమైన జాతీయ హరిత ట్రెబ్యునల్ నుంచి అనుమతులు లభించాయి. వన్య ప్రాణులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలనే షరతును ఉల్లంఘించకుండా నిర్మాణ ప్రాంతం మినహా మిగిలిన భూముల్లో మడ అడవులను వేపుగా పెంచాలనే నిబంధనను డిఆర్డిఓ తు.చ తప్పక పాటించాల్సి ఉంది.

అందరి కళ్ళు….
క్షిపణి పరీక్ష ప్రయోగ కేంద్రం కు భూమి పూజ జరగనున్న దృష్ట్యా అందరి కళ్లు గుల్లల మోద మీద పడ్డాయి.
పదేళ్ళుగా ఎదురుచూసిన దివిసీమ వాసుల చిరకాల స్వర్ణ స్వప్నం నేటికి సాకారమౌతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలతో దివిసీమ లో అభివృద్ధి ఇక పరుగులు పెట్టనుంది.గుల్లలమోద క్షిపణి ప్రయోగ కేంద్రం దివిసీమ కు మణి ముకురం కాగా నవ్యాంధ్ర ప్రదేశ్ కి కంఠాభరణంగా, భారతదేశ తీర ప్రాంతానికి రక్షణ తోరణం కాబోతోంది.
ప్రధాని నరేంద్రమోడీకి ధన్యవాదములు..
కృషి చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు కృతజ్ఞతలు…
-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్..

రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభం కోసం రాష్ట్రానికి వస్తున్న భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాగాయలంక (గుల్లలమోద) క్షిపణి పరీక్ష కేంద్రంకు వర్చువల్ పద్దతిలో ప్రారంభించనున్న సందర్భంగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదములు తెలిపారు. గురువారం అవనిగడ్డలోని తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సుమారు ఇరవై వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న నాగాయలంక క్షిపణి పరీక్ష స్థావరాన్ని డీ.ఆర్.డీ.ఓ రూపొందించారని తెలిపారు. ఈ స్థావరంలో ఉపరితలం నుంచి గగనతలంలో వస్తున్న క్షిపణులను, ఉపరితలం నుంచి వస్తున్న యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే క్షిపణుల సామర్థ్యాన్ని పరీక్షిస్తారని తెలిపారు. కృష్ణాజిల్లా సముద్ర తీర ప్రాంతంలో నిర్మితమవుతున్న ఈ క్షిపణి పరీక్షా కేంద్రం భారతదేశ రక్షణ అవసరాలను తీర్చడంలో ఇతోధికంగా తోడ్పడగలదని వివరించారు. ఈ కేంద్రం క్షిపణి ప్రయోగాలకు, సమాచార సేకరణకు, సామర్థ్య పరీక్షలకు రక్షణ శాఖకు తోడ్పడుతుంది అన్నారు. ఈ ప్రాంతపు సమతల భూమి, బంగాళాఖాత సామీప్యత, మానవ ఆవాసాల లేమి, క్షిపణి సామర్థ్య పరీక్షలకు బాగా ఉపకరిస్తుందన్నారు. అంతేకాక, ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెరుగుతున్న ప్రోత్సాహం కూడా ఈ కేంద్రం అభివృద్ధికి ఎంతగానో తోడ్పడగలదని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు నిర్మాణానికి నాగాయలంకను కేవలం కాకతాళీయంగా ఎంచుకోలేదన్నారు. ఇక్కడి సముద్ర తీర ప్రాంతం, సువిశాలమైన మైదాన భూమి క్షిపణి పరీక్షలకు అత్యంత అనుకూలమైన ప్రదేశమని బుద్ధప్రసాద్ తెలిపారు. క్షిపణుల గమనాన్ని పరిశీలించడానికి ఎంతో అనువైన ప్రాంతంగా గుర్తించారని తెలిపారు.
ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో ఈ ప్రాంత ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగవుతాయన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి, నిర్వహణకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కొన్ని వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇందులో సాంకేతిక పరిజ్ఞానం గల ఉన్నత విద్యావంతులు మొదలుకొని, కార్మికుల వరకు ఎందరికో మేలు జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ఒక మైలు రాయి అని అభివర్ణించారని తెలిపారు. నాగాయలంకలో వస్తున్న ఈ ప్రాజెక్టు డీ.ఆర్.డీ.ఓ సామర్థ్యానికి ఒక గీటురాయిగా నిలవబోతున్నదన్నారు. డీ.ఆర్.డీ.ఓ వారు ఒరిస్సా చాందీపూర్ లో నెలకొల్పిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ కేంద్రంలో అగ్ని, పృథ్వి మొదలైన ప్రతిష్టాత్మక క్షిపణులను పరీక్షిస్తున్నారని తెలిపారు. ఆ కేంద్రానికి సమాన స్థాయిలో నాగాయలంక కేంద్రం పనిచేయబోతుందని వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపైనే ఆధారపడి ఆధునిక యుద్ధ వ్యూహాల రచన జరుగుతున్న ఈ కాలంలో ఇటువంటి క్షిపణి పరీక్షా కేంద్రాల ఆవశ్యకత మన దేశానికి ఎంతయినా వుందన్నారు. పొరుగు దేశంతో మనకు ఏర్పడుతున్న చికాకుల నేపథ్యంలో మన దేశ రక్షణ పాటవాన్ని పెంపొందించుకోవడానికి ఈ క్షిపణి కేంద్రాలు ఎంతగానో తోడ్పడతాయని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. ఆ విధంగా ఈ ప్రాంతంలో గల నాగాయలంక దేశ రక్షణలో ఒక కీలక పాత్ర పోషించడానికి సన్నద్ధం కావడం తామందరికీ సంతోషదాయకమే కాక గర్వకారణంగానూ నిలుస్తుందని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్దాసక్తులతో కృషి చేసి సాధించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
