ఏపీ ఎనాలిసిస్, విజయవాడ
ప్రధాని మోది అమరావతి పర్యటన పట్ల మిశ్రమ స్పందన లభిస్తోంది. కొత్తగా ఎటువంటి ప్రకటనలు చేయకపోయినా, అమరావతి నిర్మాణంలో నేనూ బాధ్యత తీసుకుంటాను….కలిసి నిర్మిద్దామని ప్రధాని వెల్లడించారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు, నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయగల సమర్దత చంద్రబాబుకు ఉందని, గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను పని చేసిన సమయంలోనే ఆయన నుంచి ఇటువంటి విషయాలను తెలుసుకున్నానని సభాముఖంగా చెప్పారు. హైదరాబాద్ ని అంతార్జాతీయ స్ధాయికి తీసుకువెళ్లడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలను తాను అక్కడికి వెళ్లి అప్పుడే పరిశీలించి, అందుకు అనుగుణంగా గుజరాత్ లో భారీ ప్రాజెక్టులు చేపట్టానని చెప్పారు. ఇటువంటి సమర్ధత, దీర్ఢకాలిక ప్రణాళిక, విజన్ కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఫీచర్ సిటీగా తీర్చిదిద్దుతారనే నమ్మకం తనకు ఉందని ప్రకటించి ఏపీ ప్రభుత్వానికి, ప్రజలకు నైతికంగా మద్దతు పలికారు.
మాటల మాంత్రికుడు మోది ప్రసంగం టీడీపీ అనుకూల వర్గాలకు, ప్రగతి కాములకు సానుకూలంగానే కనిపించాయి. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడానికి ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎంతో సాయ పడిన నేపధ్యంలో అమరావతి నిర్మాణంలోనూ మోది తన వంతు సహకారం అందిస్తారనే భావనకు వచ్చారు. అందుకు అనుగుణంగానే ఏపీ ప్రభుత్వం అమరావతి పున: నిర్మాణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టింది. ఒక నెల రోజుల నుంచే ఏర్పాట్లు ప్రారంభించింది. అందుకు అనువుగానే ప్రధాని పర్యటనకు ఒకటి రెండు రోజుల ముందుగానే అమరావతికి పెద్ద హైప్ వచ్చింది. ఈ ఏర్పాట్లు, హడావుడి చూసి ప్రధాని అమరావతి నిర్మాణానికి ఇంతకు పూర్వం ప్రకటించిన సహాయాలు, ప్రాజెక్టులు కాకుండా కొత్తగా మరి కొన్ని ప్రకటనలు చేస్తారని చాలా మంది ఊహించారు. మీడియా కూడా దీనిని మరింతగా హైప్ చేసింది.
కొందరైతే అమరావతిని దేశ రెండో రాజధానిగా ప్రకటన చేయాలని ప్రకటనలు కూడా చేశారు. రాష్ట్ర విభజన హామీల అమలుకు ఈ సందర్భంలోనే ప్రకటన చేస్తారని ఆశించారు. అయితే ఇటువంటి హామీలపై ప్రకటనలు రావనే అభిప్రాయం మేదావి వర్గం బావించింది. వారికి ప్రధాని ప్రపంగం పెద్దగా ఆశ్చర్యం కాకపోయినా, టీడీపీ కార్యకర్తలు, రాజధాని గ్రామాల ప్రజలకు కొంత వరకు నిరుత్సాహాన్ని కలిగించాయి. నిధుల ప్రకటన లేకపోవడం, విభజన హామీల పై స్పష్టత లేకపోవడం వల్ల ముఖ్యంగా ఆర్థిక సహాయం ఆశించిన వారికి మోదీ పర్యటన నిరాశ, నిరుత్సాహాన్ని మిగిల్చింది.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ఇప్పటి వరకు రాజధాని ఏర్పడలేదు. పదేళ్లుగా అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందలేదు. ప్రత్యేక హెూదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ వచ్చింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ఇంతవరకు పూర్తి కాలేదు. ఈనేపథ్యంలో కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రజలు ఎక్కువ ఆశలు పెంచుకున్నారు. ప్రధానమంత్రి మోదీ వస్తున్నారు గనుక నైతిక మద్దతుతో పాటు ఆర్థిక మద్దతు, విభజన హామీల అమలుపై స్పష్టత ఉంటుందని ప్రజలు ఆశించడం సహజం. దానికి బదులు మోదీ ప్రసంగం పరస్పరం పొగడ్తలు, ప్రశంసలతో ముగియడం గమనార్హం. అమరావతి ఒక శక్తిగా ఎదుగుతుంది. అమరావతిని కేవలం ఒక నగరంగా కాకుండా, ఆంధ్రప్రదేశ్ ని ఆధునిక, అధునాతన రాష్ట్రంగా మార్చే ‘శక్తి’గా మోదీ అభివర్ణించారు. ఇది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా, వికసిత భారత్ కు ఓ బలమైన పునాదిగా చిత్రీకరించారు. ఆయన ఈ మాట అన్నారంటే దానర్థం రాజధాని నిర్మాణానికి నైతిక మద్దతును, దీర్ఘకాలిక దృష్టిని సూచిస్తాయి. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. బహుశా మోదీ- కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని, రాజకీయంగా బలమైన సందేశాన్ని ఇవ్వడం కోసం ఈ పొగడ్తలు చేసి ఉండవచ్చు. ముఖ్యంగా కూటమి నేపథ్యంలో మోదీ- చంద్రబాబులు ఒకర్నొకరు ప్రశంసించుకుని ఉండవచ్చు.

ఇక వైసీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి తీవ్ర స్ధాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. మోది మరోసారి ఏపీ ప్రజలను మోసం చేశారని, తొలిసారి పర్యటనలో చెంబుడు మట్టి తీసుకువచ్చారని, ఈసారి అది కూడా లేకుండా ప్రజలపై సున్నం చల్లారని పీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని ఈసారి రైతుల్ని మోసం చేశారని విమర్శించారు. అప్పులు చేసి అమరావతిని నిర్మించడం వలన ప్రజల నెత్తిన రుణ భారం పడుతుందని మరి కొన్ని వర్గాలు విమర్శలు చేస్తున్నాయి. అమరావతి నిర్మాణం ఏపీలో ఒక భాగమేనని, మిగిలిన ప్రాంతాల అభివృద్ధి గురించి చంద్రబాబు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఐదారు జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి చెందుతాయని, అయితే ఆ ప్రాజెక్టు కంటే అమరావతికి సీఎం అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారని రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడూ హైటెక్ హంగులు, నిర్మాణాలు గురించి మాట్లాడటమే కానీ రైతుల సమస్యలు, వారి అభ్యున్నతికి చంద్రబాబు ఎప్పుడూ ప్రత్యేకంగా చర్యలు తీసుకోలేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
మొత్తం మీద మోది పర్యటన పట్ల మిశ్రమ స్పందన వెలువడినా, కొందరు తీవ్ర స్ధాయిలో విమర్శలు చేసినా, ఏపీ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా మర్నాడే పనుల ప్రారంభానికి చర్యలు తీసుకుంది. మంత్రి నారాయణ శనివారం ఉధయం సీఆర్డీఏ అధికారులతోనూ, నిర్మాణ సంస్ధలు, ఇంజనీర్లు, సాంకేతిక సలహాదారులు, నిర్మాణ సంస్ధల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఒకో ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తికావడానికి రూట్ మ్యాప్ ఇవ్వాలని ఆ సంస్ధల నుంచి లిఖిత పూర్వక హామీలు తీసుకున్నారు. అదే స్పూర్తితో టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. అమరావతి నిర్మాణంతోనే రాష్ట్ర ప్రగతి ముడిపడి ఉంటుందనే భావనతో ఉన్నారు. దానినే ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు.
—
